యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణ వేడుకలను ఆగమశాస్త్ర రీతిలో జరిపారు.
సాయంత్రం వేళ బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి వెండిజోడు సేవ నిర్వహించారు. స్వామి వారికి నిత్యారాధన, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. కొండపైన ఉన్న పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు.