మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో పెనుమార్పులు రాగా.. పరీక్షల అనంతరం ప్రశ్నా పత్రాల మూల్యాంకనంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. బీఈడీ, యూజీ కోర్సులు మినహా పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ కోర్సుల జవాబు పత్రాలను ఆన్లైన్ ద్వారా మూల్యాంకనం చేసేందుకు ఎంజీయూ పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేస్తున్నది. ట్రయల్స్ విజయవంతం కావడంతో అధ్యాపకుల నియామకానికి కసరత్తు చేపట్టింది.
లాక్డౌన్ నేపథ్యంలో డిజిటల్, ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యం ఏర్పడింది. అన్ని పాఠశాలలు, కళాశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ సబ్జెక్టులను బోధిస్తున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే, ప్రశ్నా పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఆలస్యం అవుతున్నందున సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దాంతో పారదర్శకతతో పాటు వేగంగా పని పూర్తయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆఫ్లైన్ మూల్యాంకనం చేయించడంతో యూనివర్సిటీ అధికారులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా కళాశాలలు మూల్యాంకనం విధులకు అధ్యాపకులను పంపించకపోవడంతో ఫలితాల విడుదల ఆలస్యం అవుతున్నది. ఆన్లైన్ మూల్యాంకనంతో యూనివర్సిటీ ఎంపిక చేసిన కళాశాల సీనియర్ అధ్యాపకులతోపాటు, ఇతర యూనివర్సిటీల అధ్యాపకులకు సైతం జవాబు పత్రాలను పంపే వీలుంటుంది. దీంతో ఫలితాలు త్వరగా అందించే అవకాశం ఉంటుంది.
తొలి విడుతలో పీజీ, ఇతర కోర్సుల్లో.
ఎంజీయూలో ఆన్లైన్ మూల్యాంకనం యూజీ, బీఈడీ కోర్సులు తప్ప మిగిలిన కోర్సులో అమలు చేస్తున్నారు. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ ఇతర కోర్సులకు ఆన్లైన్ విధానం పాటిస్తున్నారు. జూలైలో పూర్తయిన పరీక్షలతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న పరీక్షల జవాబు పత్రాలను ఆన్లైన్ విధానంలో మూల్యాంకనం చేయనున్నారు. అధ్యాపకులకు ప్రత్యేకంగా ఐడీ, పాస్వర్డ్ రూపొందించి స్కాన్ చేసిన జవాబు పత్రాలను పంపిస్తారు. కేటాయించిన నిర్ణీత సమయంలో మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో అధ్యాపకులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
సాంకేతికతను అందిపుచ్చుకునేందుకే…
పారదర్శకత, ఫలితాల్లో వేగవంతానికి ఆన్లైన్ మూల్యాంకనం దోహదపడుతుంది. వీసీ, రిజిస్ట్రార్ నిర్ణయంతో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడిస్తున్నాం. గతంలో అధ్యాపకుల కొరత వల్ల మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమైంది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా చేపట్టే అవకాశాలు ఉండడంతో అధ్యాపకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.