భువనగిరి అర్బన్, ఆగస్టు 5: అధికారులు సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, డీఆర్డీవో ఉపేందర్రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉన్నందన ఏర్పాట్లలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్, జూనియర్ కళాశాల మైదానంలో ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కేవలం అధికారులే కాకుండా వివిధ విభాగాల సిబ్బంది కూడా ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
మున్సిపాలిటీల్లో పారిశుధ్య సిబ్బంది, వైద్యఆరోగ్యశాఖలో హౌజింగ్ వర్కర్స్, ఇతర సాధారణ సిబ్బందికి ప్రాధాన్యమిచ్చి వారి ప్రతి భ ఆధారంగా ప్రశంసాపత్రాలకు ఎంపిక చేయాలన్నారు. వివిధ శాఖల అభివృద్ధి ప్రగతిని ప్రదర్శించేలా స్టాళ్ల శకటాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, స్టాళ్ల ఏర్పాటు విషయంలో వివిధ విభాగాల శాఖలు ప్రభుత్వ పథకాలు, వాటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ అర్థమయ్యేలా బ్యానర్లను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులందరూ సకాలంలో తమ కార్యాలయంలో ఆయా శాఖ లు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, పథకాలను ప్రజలకు తెలిసేలా బ్యానర్లను ప్రదర్శించాలన్నారు. పంద్రాగస్టు వేడుకల్లో ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించేలా, కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి మంచి ఆహారం అందించేందుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మీ- సేవ కేంద్రాల నిర్వాహకులు‘ధరణి’పై అవగాహన కలిగి ఉండాలి
భువనగిరి అర్బన్, ఆగస్టు5: జిల్లాలోని మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు ధరణి కార్యక్రమంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. గురువారం మీ-సేవ కేంద్రాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ధరణి అర్జీదారుల దరఖాస్తులు తదితర డాక్యుమెంట్ల అప్ లోడింగ్పై ఆమె అవగాహన కల్పించారు. మీ- సేవ కేంద్రాల ఆపరేటర్లు అర్జీదారుల సమస్యలను తెలుసుకుని సరిగ్గా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. తెలియకపోతే తెలుసుకోవాలని తెలిసిపొరపాట్లు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, పనితీరుపైనే మీ లైసెన్స్ రెన్యువల్ ఆధారపడి ఉంటుందని కలెక్టర్ సూచించారు. మీ-సేవ కేంద్రా ల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తప్పవన్నారు. డబ్బు చెల్లింపు వివరాలను మీ-సేవ కేంద్రాల్లో పెద్ద అక్షరాలతో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని, నిర్వాహకుల తప్పిదాలతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి, జిల్లా మేనేజర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.