యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బౌద్ధ, జైన, వీర శైవ మతాలన్నీ ఒకేచోట పరిఢవిల్లి.. ఎంతో గొప్ప ప్రాశస్త్యం కలిగిన ‘కొలనుపాక’ ఆస్తిత్వాన్ని కాపాడే దిశగా అడుగులు పడుతున్నాయి. పురావస్తు శాఖ నుంచి రూ.1.79కోట్లు మంజూరుకాగా.. యాదాద్రి పునర్నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఆలయ ప్రాధికార సంస్థ(వైటీడీఏ) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఈ ప్రాంత అభివృద్ధికి సమగ్ర నివేదిక రూపొందుతుండడంతో కొలనుపాకకు మంచి రోజులు వచ్చాయంటూ స్థానికులు సంబురపడుతున్నారు.
కొలనుపాక చారిత్రకంగా.. ఆధ్యాత్మికంగా.. సామాజికంగా ఎంతో ప్రాధాన్యం గల ప్రాంతం. ఈ నేలను రాష్ట్ర కూటుల నుంచి నిజాం రాజుల దాకా పాలించారు. యాదాద్రి ఆలయానికి చేరువలో.. ఆలేరు మండల కేంద్రానికి 6కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పల్లె విభిన్న ఆలయాలకు నిలయంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. దక్షిణ కాశీగా, మహా శైవ పుణ్య క్షేత్రంగానూ కొలనుపాక భాసిల్లుతున్నది. రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా.. అప్పటి రాజులు విశాల దృక్పథంతో, కళా దృష్టితో చేపట్టిన నిర్మాణాలు, శిల్పాలు అలనాటి సంస్కృతీ సంప్రదాయాలకు సాక్షీభూతాలుగా నిలుస్తున్నాయి. 18 రకాల మఠాలు భిన్నమతాల వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. కొలనుపాకలో బయటపడ్డ అనేక శాసనాలు.. రాష్ట్ర కూటుల నుంచి నిజాం రాజుల వరకు జరిగిన పాలనా తీరును, అప్పటి సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాయి. ఈ నేపథ్యంలో చారిత్రక ఆలయాల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం.. చారిత్రక సంపద పరిరక్షణ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. ‘కొలనుపాక’ అభివృద్ధిపై ఈ ప్రాంతవాసులు పెట్టుకున్న ఆశలను సజీవంగా నిలుపుతున్నాయి.
కొలనుపాక అభివృద్ధికి ప్రణాళికలు…
పర్యాటకంగానూ అనేక హంగులను కలిగిన కొలనుపాక గత పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. అయితే యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మిస్తున్న తరుణంలో కొలనుపాకకు సైతం మంచి రోజులు వస్తాయని ఈప్రాంత వాసులు ఆశించారు. యాదాద్రి సందర్శనార్థం వచ్చే భక్తజనం కోసం కొలనుపాకను సైతం సకల హంగులతో తీర్చిదిద్దాలని స్థానికులు, చరిత్ర కారులు గత కొంతకాలంగా కోరుతున్నారు. పురావస్తు ప్రదర్శన శాల కోసం ఇప్పటికే తెలంగాణ పర్యాటక శాఖ, పురావస్తు శాఖలు సంయుక్తంగా సుమారు రూ.6కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాయి. ఇదే క్రమంలో కొలనుపాకలోని దేవాలయాల పునరుద్ధరణకు తాజాగా.. పురావస్తు శాఖ 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,79,74,743 మంజూరు చేసింది. ఇదే క్రమంలో వారసత్వ సంపద పరిరక్షణతోపాటు.. ఈ ప్రాంత అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. కొలనుపాక అభివృద్ధికి అడుగులు పడుతున్న నేపథ్యంలో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
చారిత్రక సంపదకు నెలవు..శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే
విగ్రహాలు, శాసనాలు, కొలనుపాక ప్రాంతంలో విస్తృతంగా లభ్యమయ్యాయి. కొలనుపాక చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే విగ్రహాలు, శాసనాలు ఇప్పటికీ లభ్యమవుతూనే ఉన్నాయి. క్రీ.శ. 5-15 శతాబ్దాల కాలం నాటి శిల్పాలు, గజలక్ష్మీ ధ్వజస్తంభం, చాముండి, నటరాజు, భైరవుడు, నాగశిల్పం, సప్తమాతృకలు, వీరభద్రుడు, భద్రకాళి, ఆరో విక్రమాదిత్యుడి శాసనాలు, 1085 నాటి తొండర చోళరాజు శాసనాలను 1969లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగ్రహాలయంలో భద్రపరిచారు. స్థలం లేక కొన్నింటిని ఆరు బయటనే ఉంచారు. అయితే ఇక్కడ లభ్యమైన సరస్వతీదేవి, సప్త మాత్రికలు, కోష్ట పంజరం, కోదండ రాముడు, వీరగల్లు, సూర్యుడు, అష్టలక్ష్మి విగ్రహాలు ఎంతో అరుదైనవి. ఇక హనుమంతుడి కుమారుడిగా చెప్పుకొనే మత్స్యవల్లభుని విగ్రహం కూడా ఇక్కడే ఉన్నది. ఇలాంటిది దేశంలోనే మరెక్కడా లేక పోవడం విశేషం. బౌద్ధ, జైన మతాలకు సంబంధించి గౌతమ బుద్ధుడు, మహావీరుడి విగ్రహాలు సైతం ఇక్కడ బయటపడ్డాయి. కొలనుపాక సమీపంలోని వాగులో లభించిన పంచ లోహపు గంటలను హైదరాబాద్ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు.
ఎన్నో విశిష్టతల సోమేశ్వర, వీర నారాయణ స్వామి ఆలయాలు..
కొలనుపాకలో మరో ప్రసిద్ధ దేవాలయం శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం. కళ్యాణీ చాళుక్యులు, కాకతీయ రాజుల కాలంలో సోమేశ్వర, వీర నారాయణ స్వామి ఆలయాలను నిర్మించారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు సైతం ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. సోమేశ్వర ఆలయంలో శివలింగం స్వయంభువుగా ప్రసిద్ధి గాంచింది.సహస్రలింగాన్ని కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు, ఆయన సోదరి మైలాంబ ప్రతిష్ఠించారు. కాకతీయుల శిల్పకళారీతులను పుణికి పుచ్చుకున్న ఈ క్షేత్రంలోని కోటి లింగేశ్వర ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఆలయంలో కోటి లింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యి లింగాలు తక్కువ కావడం వల్ల ఒకే రాయిపై చెక్కి ప్రతిష్ఠించారట. అదే ఈ కోటి లింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. కొలనుపాకలో చారిత్రక ప్రాశస్త్యం గల మరో ఆలయం వీర నారాయణ స్వామి ఆలయం. దీనిని క్రీ.శ.1105లో జగద్దేవుడు నిర్మించాడు.
యాత్రా క్షేత్రంగా ప్రసిద్ధి…
కొలనుపాకలోని సోమేశ్వర స్వామి, వీర నారాయణ స్వామి ఇతర ఉప ఆలయాలను నిత్యం భక్తులు సందర్శిస్తూనే ఉంటారు. ప్రతి శివరాత్రికి సోమేశ్వరాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. చైత్ర బహుళ తదియ మొదలు పంచమి వరకూ రేణాకాచార్య జయంత్యుత్సవాలు, రథోత్సవం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. కర్ణాటక నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తారు. కాకతీయుల కాలంలోనూ కొలనుపాక గొప్ప జైన క్షేత్రంగా కొనసాగింది. క్రీ.శ.1276 నాటి కోగలి తీర్థ శాసనంలో కొలనుపాక జైనులకు తీర్థయాత్ర స్థలమని ప్రస్థావన ఉన్నది. ఏటా ఇక్కడ జరిగే మహావీరుడి జయంతి, రథోత్సవానికి దేశ విదేశాల నుంచి జైనులు తరలివస్తుంటారు. జైన దేవాలయ సందర్శనార్థం రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు. నలుమూలల నుంచి వచ్చిన జైనులు, జైనేతరులు, జైన మతాచార్యులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు సైతం విజ్ఞాన యాత్రల కోసం కొలనుపాకను సందర్శిస్తుంటారు.
వైటీడీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తాం…
కొలనుపాక ప్రాంతం వైటీడీఏ పరిధిలో ఉన్నది. వైటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. పురావస్తు శాఖ విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం నిధులను కొలనుపాకలో శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణకు వినియోగించనున్నాం. కొలనుపాకకు పూర్వ వైభవం తెచ్చేలా వైటీడీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
– కిషన్రావు, వైటీడీఏ వైస్ చైర్మన్
పునరుద్ధరణ నిర్ణయం చరిత్రాత్మకం…
వెయ్యేండ్ల చరిత్ర కలిగిన శ్రీలక్ష్మీసమేత వీరనారాయణస్వామి ఆలయాన్ని పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ పూనుకోవడం సంతోషదాయకం. రావూరి సంజీవ కవి రాసిన వీరనారాయణ శతకం ఈ ఆలయానికి సంబంధించినదే. ఆలయ చరిత్రను ప్రత్యేకంగా అధ్యయనం చేయడంతో పాటు నిర్మాణం కోసం నమూనాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో గొప్ప విషయం.
– పాండురంగశాస్త్రి, వీరనారాయణస్వామి ఆలయ పూజారి, కొలనుపాక
పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలి…
కొలనుపాకను పర్యాటక క్షేత్రంగా మరింతగా తీర్చిదిద్దాలి. వైటీడీఏ ద్వారా 1.79కోట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలకు మహర్దశ వచ్చింది. యాదాద్రి తరహాలో కొలనుపాక అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలి.
– ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, సర్పంచ్, కొలనుపాక
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలోని దేవాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో దేవాలయాలకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తున్నారు. యాదాద్రి, కొలనుపాక, కొమురవెళ్లిని కలుపుతూ.. టూరిస్ట్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించడం హర్షణీయం.
– చిర్రబోయిన జగతయ్య, కొలనుపాక గ్రామస్తుడు
శుభ పరిణామం…
చారిత్రక సోమేశ్వరాలయం పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు విడుదల చేయడం శుభపరిణామం. సీఎం తీసుకున్న నిర్ణయాల వల్ల అపురూపమైన చారిత్రక సంపద భావితరాలకు అందించే అవకాశం కలుగుతుంది. సోమేశ్వరాలయ ప్రాంగణంలో ప్రాచీన చరిత్రకు అనవాలుగా శాసనాలు, దేవతామూర్తుల విగ్రహాలు లభిస్తాయి.
– గౌండ్ల మఠం సోమయ్యా చార్యులు, అర్చకుడు