డీసీపీ నారాయణరెడ్డి
యాదాద్రి, మే 5 : తలసేమియా రోగులను రక్షించేందుకు రక్తదానం చేయడం అభినందనీయమని రాచకొండ పోలీస్ కమిషనరేట్ భువనగిరి డివిజన్ డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు భువనగిరి పోలీస్శాఖ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సంయుక్తంగా బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కరోనా నిబంధనలు పాటిస్తూ రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో అనేక మంది రోగులు రక్తం కోసం వేచి చూస్తున్నారని, వారి ప్రాణాలను రక్షించేందుకు రక్తదానం చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం పోలీస్శాఖ కరోనా సమయంలో ముందు నిలబడి కృషి చేస్తుందన్నారు.
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఆపద కాలంలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని, వారిని చూసి యువత రక్తదానం చేసేందుకు ముందు వరుసలో నిలబడాలని కోరారు. తలసేమియా రోగులకు, మరోపక్క కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తదానం చేయడం ఎంతో ప్రధానమైన విషయమన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కోట్ల నరసింహారెడ్డి, శ్రీనివాసారావు, పట్టణ సీఐ జానకిరెడ్డి, రూరల్ సీఐ నర్సయ్య, ఆర్ఐ అడ్మిన్ నాగరాజు, ఎస్సైలు రమేశ్, యాదయ్య, శ్రీదర్రెడ్డి, సురేశ్రెడ్డి, మమత, రెడ్ క్రాస్ ప్రతినిధులు ఎస్.ఎన్.చారి, గిరి, శివ తదితరులు పాల్గొన్నారు.