యాదాద్రి, జనవరి 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకంతో అర్చించిన అర్చక బృందం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో జరిపించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండిజోడు సేవను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వ్రతమాచరించారు. పూర్వగిరి(పాతగుట్ట) నరసింహ స్వామి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాంటకంగా దర్శనాలు కొనసాగాయి. యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరాలయంలో పరమశివుడికి పురోహితులు రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్లో వెలసిన బాల శివాలయంలో ప్రభాతవేళలో మొదటి గంటన్నర పాటు శివుడ్నికొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో అలంకరించారు. శివాలయ ప్రధాన పురోహితుడి ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. శ్రీవారి ఖజానాకు సోమవారం రూ. 9,08,011ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.