ఆలేరు టౌన్, మే 11 : ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైనది నర్సింగ్ వృత్తి. దవాఖానలో వీరి సేవలు ఎంతో అవసరం. వైద్య వృత్తి ఎన్ని నూతన పోకడలో పోతున్నా..ఎన్ని యంత్రాలు వచ్చినా.. వీరి సేవకు మాత్రం వెల కట్టలేం. కరోనా మహమ్మారి కకావికలం చేస్తున్న తరుణంలో కూడా వారు సేవలందిస్తున్నారు. అయిన వారే బాధితుల దగ్గరకు రాలేని, పలకరించలేని పరిస్థితిలోనూ ఇంటింటా జ్వర సర్వే చేస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. దవాఖానకు వచ్చే బాధితులకు ఓర్పుగా కరోనాపై అవగాహన కల్పిస్తూ వారికి టీకా వేస్తున్నారు. వైరస్ సోకిన వారిని కుటుంబ సభ్యులే నిర్లక్ష్యం చేయడంతోపాటు కొవిడ్ మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లకుండా శ్మశానవాటికలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోనూ నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తస్తున్నారు. మరికొందరు నర్సులు కరోనాను జయించి కూడా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు. అయితే విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాక వారు పడుతున్న బాధలు అంతాఇంతా కాదు. తమ వల్ల పిల్లలకు వైరస్ సోకే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. జిల్లాలో 210 మంది ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా స్వైన్ఫ్లూ, క్షయ వంటి వ్యాధులకు కూడా వీరు ధైర్యంగా సేవలు అందిస్తున్నారు.
నర్సింగ్ వృత్తి ప్రస్తానం…
ఓ నర్సు ఆధునిక వైద్య సేవకురాలిగా మారేందుకు మూలరూపం ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్. యూరప్ ఖండంలోని క్రీమియర్ అనే ప్రాంతంలో ఒకప్పుడు భీకర పోరు సాగింది. ఇందులో వేల సంఖ్యలో చనిపోయారు, గాయపడ్డారు. ఓ మహిళ మాత్రం ఎలాంటి భయం లేకుండా ధైర్య సాహసాలతో వైద్య సేవలు అందించింది. ఆమె పేరే ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈమె రాత్రిపూట సైతం యుద్ధంలో గాయపడిన సైనికులను పరామర్శించడానికి దీపంతో సంచరించేది. యుద్ధభూమిలో ఆమె చేసిన సేవలకు ప్రపంచం ప్రశంసలు కురిపించింది. లేడీ విత్ ది యాంప్ అనే బిరుదును నైటింగేల్ అందుకున్నది. 1910 ఆగస్టు 13న చనిపోయింది. ప్రతి సంవత్సరం మే 12న ఆమె జయంతిని పురస్కరించుకొని ‘ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు.
సేవ చేయడం అదృష్టం..
విధి నిర్వహణలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నప్పటికీ బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నాం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సేవలందిస్తున్నాం. ఇలా సేవలు అందించడం సంతృప్తిగా ఉన్నది. కరోనా బాధితులు త్వరగా కోలుకునేలా ధైర్యాన్ని ఇస్తున్నాం.
కరోనాను జయించి
విధుల్లో భాగంగా రెండు నెలల కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 15 రోజులు చికిత్స తీసుకున్నాను. కోలుకొని మళ్లీ విధులకు హాజరవుతున్నాను. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాలంటే భయంగానే అనిపిస్తున్నది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ.. ఇటు దవాఖానలో రోగులకు సేవలందిస్తున్నాను.
నైటింగేల్ స్ఫూర్తితో..
నైటింగేల్ స్ఫూర్తితో విధుల్లో రాణిస్తున్నాను. నర్సులకు సమాజంలో గౌరవ స్థానం ఉన్నది. కరోనా సెకండ్ వేవ్తో విధులు నిర్వహించాలంటే ఒక్కోసారి భయం వేస్తున్నది. అయినప్పటికీ తప్పదు. కరోనా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెబుతున్నాం. ఇంటికి వచ్చాక కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాం.
సకాలంలో స్పందిస్తున్నాం..
కొవిడ్ కష్టకాలంలోనూ సకాలంలో విధులు నిర్వహిస్తూ స్పందిస్తున్నాం. కరోనా బాధితులకు సేవ చేయడం అదృష్టంగానే భావిస్తున్నాం. మదర్ థెరిస్సా లాంటి వారు రోగులకు తమ జీవితాన్ని అంకితం చేశారు. వృత్తిలో కొంత ఇబ్బంది ఉన్నా.. ప్రాణాలకు ఊపిరిపోసే వైద్య సేవల్లో తమ కర్తవ్యం ఉండటం సంతోషాన్ని ఇస్తుంది.
ధైర్యంగా విధులు
కరోనా రోగులతోపాటు ఇతరులకు సేవలందిస్తున్నాం. ప్రస్తుతం కరోనా కోరలు చాస్తున్నా ఏ మాత్రం భయపడకుండా విధుల్లో పాల్గొంటున్నాం. వైరస్ సోకే అవకాశం కూడా ఉన్నది. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సేవలందిస్తున్నాం. ప్రజారోగ్య పరిరక్షణకు పని చేయడం సంతోషంగా ఉన్నది.