యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి బుధవారం వస్తున్నారు. దత్తత గ్రామం వాసాలమర్రికి సీఎం రావడం ఇది రెండోసారి. గత జూన్ 22న తొలిసారిగా సీఎం కేసీఆర్ వాసాలమర్రికి వచ్చారు. తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామాభివృద్ధిపై చర్చించేందుకు గ్రామసభను నిర్వహించి గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మరోసారి వాసాలమర్రికి సీఎం వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాం గం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి ప్రస్థానమిదీ..
అక్టోబర్ 31, 2020
జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి వద్ద ఆగిన సీఎం కేసీఆర్ కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. ఈసందర్భంగా వారు పలు సమస్యలను సీఎం వద్ద ప్రస్తావించగా, సమస్యలపై చర్చించేందుకు ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్కు రావాల్సిందిగా సూచించారు.
నవంబర్ 1, 2020
ఫాంహౌజ్కు వెళ్లిన సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఇతర గ్రామస్తులతో ముచ్చటించి.. గ్రామ సమస్యలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంకాపూర్ తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. రూ.100 కోట్లు ఖర్చైనా సరే! వాసాలమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
నవంబర్ 6, 2020
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నవంబర్ 16వ తేదీ వరకు ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించారు. రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా అధికారుల బృందం వాసాలమర్రిలో పర్యటించి గ్రామ అభివృద్ధితోపాటు స్థానికులకు ఉపాధి కల్పించే విషయమై బ్లూప్రింట్ రూపొందించి సిద్ధం చేశారు.
నవంబర్ 17, 2020
యశోద దవాఖాన యాజమాన్యం వాసాలమర్రిలో హెల్త్ క్యాంపును నిర్వహించింది. 40 మంది వైద్య బృందం శిబిరంలో వైద్య సేవలను అందించింది. మొత్తం 1,118 మందిని పరీక్షించి ఉచితంగా మందులను సైతం అందజేశారు.
నవంబర్ 18, 2020
అభివృద్ధిలో ఆదర్శంగా నిలువడంతోపాటు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామ సందర్శనకు మొత్తం 284 మంది గ్రామస్తులు వెళ్లారు. అక్కడి గ్రామస్తులు సమష్టిగా సాధించిన అభివృద్ధిని కళ్లారా చూసి వచ్చారు.
జూన్ 18, 2021
సీఎం కేసీఆర్ వాసాలమర్రి సర్పంచ్ అంజయ్యకు ఫోన్ చేశారు. గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. తన పర్యటనలో అభివృద్ధి పరంగా తీసుకోనున్న విషయాలను ఈ సందర్భంగా వివరించారు.
జూన్ 22, 2021
ఇచ్చిన మాట ప్రకారం వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయడంతోపాటు గ్రామసభ నిర్వహించి వాసాలమర్రి సమగ్ర అభివృద్ధిపై కూలంకషంగా చర్చించారు. ఐక్యతతో గ్రామాన్ని అభివృద్ధి పథాన నిలపాలని తన సుదీర్ఘ ప్రసంగంలో ఉద్బోధించారు. వాసాలమర్రి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ పమేలాసత్పతిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని 421 పంచాయతీలకు రూ.25లక్షల చొప్పున, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి, ఇతర ఐదు మున్సిపాలిటీలకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ఇదే వేదికపై ప్రకటించారు.
జూన్ 25, 2021
వాసాలమర్రి ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ప్రధాన కమిటీతోపాటు ఏడు అభివృద్ధి కమిటీల ఏర్పాటుకు కార్యరూపం ఇచ్చారు. అభివృద్ధి కమిటీలు చేయాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు.
జూన్ 29, 2021
సీఎం కేసీఆర్ మాటల స్ఫూర్తితో గ్రామస్తులంతా సంఘటితమై గ్రామంలో రెండు గంటలపాటు శ్రమదానం చేశారు. ఇండ్ల మధ్యన పెరిగిన ముళ్లపొదలతోపాటు చెత్త, పెంట కుప్పలను తొలగించుకున్నారు.
జూలై 9, 2021
మరోసారి ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్ తొలిసారిగా వాసాలమర్రిని సందర్శించిన సందర్భంగా ఆదేశాలు జారీ చేయడంతో 40మంది అంగన్వాడీ సిబ్బంది గ్రామంలోని 10 వార్డుల్లో సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించారు.
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు..
వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి మంగళవారం వాసాలమర్రిలో పర్యటించి బందోబస్తు చర్యలు పర్యవేక్షించారు. ఎర్రవల్లి ఫాంహౌజ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వాసాలమర్రి గ్రామానికి సీఎం చేరుకోనున్నారు. కొండాపురం గ్రామం నుంచి వాసాలమర్రిలోని సభాస్థలి వద్ద, అక్కడి నుంచి తుర్కపల్లి చేరుకునే రోడ్డు పరిసరాల్లో, వాసాలమర్రి గ్రామంలో సైతం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం ప్రత్యేక భద్రతాధికారులు సైతం వాసాలమర్రిలో పర్యటించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పునఃసమీక్షించారు. ప్రత్యేక బలగాలు గ్రామం మొత్తాన్ని మోహరించాయి. సీఎం కేసీఆర్ గత పర్యటన మాదిరిగానే ఈసారి కూడా కేవలం వాసాలమర్రి గ్రామస్థులు మాత్రమే సీఎం పర్యటనలో పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
దత్తత గ్రామం వాసాలమర్రిలో బుధవారం సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టర్ పమేలాసత్పతి వాసాలమర్రిని సందర్శించారు. అదనపు కలెక్టర్ దీపక్తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, డీపీవో సాయిబాబా, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులతో కలిసి గ్రామంలోని దళితవాడతోపాటు గ్రామం మొత్తం తిరిగి పారిశుధ్య పనులను పరిశీలించారు. సమావేశం నిర్వహించనున్న రైతు వేదిక భవనాన్ని, గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధిపై చర్చించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో భూపాల్రెడ్డి, స్థానిక సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఎంపీడీవో ఉమాదేవి, ఏవో దుర్గేశ్వరి తదితరులు ఉన్నారు.