యాదాద్రి భువనగిరి, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు మోడుబారిన ఆ ఊరి లో ఆకుపచ్చని పొద్దు పొడిచింది. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలతో వీధులన్నీ పచ్చందాలను సంతరించుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్పేట గ్రామంలో ఐదారేండ్ల క్రితం అక్కడక్కడ మాత్రమే చెట్లు కన్పించేవి. ప్రభుత్వ సంకల్పానికి ప్రజా భాగస్వామ్యం తోడవ్వడంతో గత ఆరు విడుతల హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో నేడు కనుచూపు మేరంతా పచ్చదనమే కనిపిస్తున్నది. రో డ్లు, వీధులు పచ్చదనంతో మెరిసిపోతున్నాయి. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, స్థానికులు సమిష్టిగా మొక్కల సంరక్షణకు తీసుకున్న చర్యలు ఇక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి.
ప్రతి కాలనీలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన గన్నేరు, కాగితపు పూలు, టెకోమా చెట్లు, కానుగు చెట్లు గ్రామానికి వన్నె తీసుకొచ్చాయి. ప్రతి ఇంటిముందు పెంచుకున్న తీరొక్క మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో ఇప్పటి వర కు సుమారు 300పైగా కానుగు చెట్లు, 170 వర కు టెకోమా, 550కిపైగా గన్నేరు, 450 వరకు ఇతరత్రా మొక్కలను నాటగా.. అవన్నీ నేడు నిలువ నీడనిచ్చే చెట్లుగా మారాయి. కొత్తగా ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం గ్రామానికి కొత్త సొబగులు తీసుకొచ్చింది.
ఏడో విడుత హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున 900 మొక్కలను పంపిణీ చేయగా..కొంతమంది ఇంటి వద్ద, మరికొందరు వ్యవసాయ బావుల వద్ద నాటుకున్నారు. ప్రస్తుతం నర్సరీలో పెంచుతున్న టేకు, సీమ తంగేడు, టెకోమా, బొప్పా యి, గన్నేరు, బురుగు, మునగ, ఖర్జూర రకాలకు చెందిన 8000 మొక్కలను నాటేందుకు పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పచ్చదనం సొంతం చేసుకున్న తమ పల్లెను చూసి గ్రామస్తులు సైతం సంబరపడిపోతున్నారు.