యాదాద్రి, జూన్ 29: ఆలేరు నియోజకవర్గంలో సాగునీటి గోస రానివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఎనిమిది మండలాలకు సాగునీటి లభ్యత, చేపట్టాల్సిన పనులపై మంగళవారం కలెక్టరేట్లో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఆశ్వరావుపల్లి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ద్వారా ఆలేరు మండలంలోని టంగుటూరు, పటేల్గూడెం, శారాజీపేట, గొలనుకొండ, ఆలేరు, కొల్లూరు గ్రామాలతో పాటు గుండాల మండలంలోని 30 చెరువులు నింపి, సుమారు 16,716 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే వెసులుబాటు ఉందన్నారు. తపాసుపల్లి జలాశయం ద్వారా రాజాపేట మండలంలోని కొన్నె చెరువు ద్వారా బొందుగుల చెరువులోకి నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కాళేశ్వరం 15వ ప్యాకేజీ ద్వారా నిర్మితమవుతున్న గంధమల్ల జలాశయంలో భాగంగా 19 కిలో మీటర్ల డిస్ట్రిబ్యూటరీ కాల్వ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ నష్టపరిహారం రైతులకు వెంటనే అందజేయాలని ఎస్డీసీ విజయలక్ష్మిని ఆదేశించారు. భూ సేకరణలో జనరల్ అవార్డు పాస్ చేసి వారికి పరిహారం చెల్లించకముందే రైతు బంధు పథకాన్ని తొలగించడం సరైందికాదన్నారు. భువనగిరి మండలంలోని వీరవెల్లి నుంచి వచ్చే బునాదిగాని కాల్వ రీచ్3 మోటకొండూర్ మండలంలోని కదిరేణిగూడెం గుండా ఆత్మకూరు(ఎం) మండలానికి విస్తారంగా సాగుజలాలు వచ్చే వీలున్న నేపథ్యంలో కాల్వ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం వెంటనే చెల్లించి సకాలంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
త్వరలో గోదాంల నిర్మాణాలు
పీఏసీఎస్ చైర్మన్ల కోరిక మేరకు నియోజకవర్గంలోని ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో త్వరలో గోదాంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. ఇందుకోసం కావాల్సిన స్థలాన్ని సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి స్పందిస్తూ స్థలం సేకరించామన్నారు.
లప్పనాయక్తండా నిర్వాసితులకు సకల వసతులతో స్థలం
కాళేశ్వరం 16వ ప్యాకేజీలో నిర్మిస్తున్న నృసింహస్వామి జలాశయంలో ముంపు గ్రామమైన యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్తండా గ్రామస్తులకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రభుత్వ విప్ హామీ ఇచ్చారు. దాతారుపల్లిలో కేటాయించిన 12 ఎకరాలు 150 కుటుంబాలకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో భూపాల్రెడ్డి, ఎస్డీసీ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీప్రసాద్ పాల్గొన్నారు.