పెండ్లి అంటే నూరేళ్ల పంట.. అందుకే ఈ వేడుకను ఎవరైనా అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. కానీ ప్రస్తుతం పెండ్లిళ్లపై కరోనా ప్రభావం పడింది. గత ఏడాది ఇదే సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా మంది వివాహాలను వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడం.. మే, జూన్ మాసాల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో చాలా మంది పెండ్లిళ్లకు సిద్ధమయ్యారు. కానీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా మళ్లీ కోరలు చాచడం.. కొవిడ్ నిబంధనలను కఠినతరం చేయడంతో వివాహాలు పెట్టుకున్నవారు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు. దీనికి తోడు పెండ్లిళ్లపై ఆధారపడిన వారి ఉపాధిపై సైతం తీవ్ర ప్రభావం పడింది.
కళ తప్పుతున్న శుభకార్యాలు
ఆలేరు టౌన్, మే 5 : పెండ్లి అంటే నూరేండ్ల పంట. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. వధూవరులు ఈ వేడుక కోసం ఎన్నో కలలు కంటారు. గత ఏడాది కరోనా దెబ్బతో ఎంతో మంది ఇక్కట్లు పడ్డారు. లాక్డౌన్తో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అప్పట్లో కొంత సడలింపులతో నిరాడంబరంగా శుభకార్యాలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. దీంతో పెళ్లిళ్లు వాయిదా పడేలా ఉన్నాయి. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో వివాహాలు చేసుకునే వారు సందిగ్ధంలో పడ్డారు. గత ఏడాది కరోనా నిబంధనలతో పెండ్లి జరుపుకోలేక వాయిదా వేసుకున్న వారు ఈ ఏడాది జరుపుకుందామని భావిస్తుండగా మహమ్మారి 2వ దశ అడ్డంకిగా మారింది. దీంతో ఈ సీజన్ గిరాకులపై ఆధారపడ్డ పలువురు ఆందోళన చెందుతున్నారు.
ఉగాది తర్వాత మంచి రోజులు
ఉగాది తర్వాత మంచి రోజులు వచ్చాయి. ఏప్రిల్ 29 నుంచి జూన్ 7 వరకు ముహూర్తాలు ఉన్నాయి. మేలో 1,2,3,7,8,9, 13,14, జూన్, జూలై నెలల్లోనూ మరో 15 రోజులు మంచి రోజులుగా గుర్తించి పెండ్లి ముహూర్తాలు నిశ్చయించారు. ఎంతో మంది వివాహాలు జరిపించాలని ఫంక్షన్హాళ్లను బుక్ చేశారు. వంట వారికి అడ్వాన్స్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వధూవరుల కుటుంబీకులకు కరోనా బెంగ పట్టుకుంది. పెండ్లి ఎలా చేయాలి, ఎంత మందిని పిలువాలి, పిలిస్తే ఎంత మంది వస్తారోనని అయోమయంలో పడ్డారు. ఇది ఇలా ఉంటే నిబంధనలు అడ్డు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొందరు శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు సాదాసీదాగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు బంగారు ఆభరణాలు, వస్ర్తాలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం కరోనా నివారణకు నిబంధనలు కఠినతరం చేస్తుంది. మరోమారు లాక్డౌన్ విధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం
గత ఏడాది లాక్డౌన్తో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్తో పెళ్లిళ్ల సీజన్ గిరాకులపై ఆధారపడ్డ వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రతి శుభకార్యానికి వస్ర్తాలను కొనుగోలు చేస్తారు. ఆడ, మగ పెండ్లి వారు నూతన వస్ర్తాలు కొంటారు. కరోనా వల్ల శుభ కార్యాలు నిలిచిపోతే వస్ర్తాల కొనుగోలు జరగదు. దీంతో బట్టల షాపుల్లో పని చేసే వారికి కూడా జీతాలు చెల్లించాలంటే వ్యాపారులకు ఇక్కట్లే. అంతే కాకుండా వారు తీసుకున్న షాపుకు కూడా కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే శుభకార్యంలో భాజాభజంత్రీలు, బ్యాండు మేళాలు తప్పనిసరి. గృహ ప్రవేశాలు, వివాహాలు జరిగేటప్పుడు వీటి అవసరం తప్పనిసరి. సాదాసీదాగా జరుపుకుంటే వీరికి జీవనం కూడా బారం కానున్నది. ఇకపోతే వంట వారికి, వీడియో, ఫొటోగ్రాఫర్లకు కూడా కష్టాలే. అలాగే శుభకార్యాల్లో డెకరేషన్కు ప్రాధాన్యం ఇస్తారు. రకరకాల పువ్వులు, సెట్టింగ్లు, లైటింగ్తో డెకరేషన్ చేస్తారు. దీని కోసం లక్షలు ఖర్చు చేస్తారు. వీరికి కూడా ఉపాధి కరువయ్యే అవకాశం ఉంది. ఎంతో మంది పెండ్లి ఘనంగా చేయడంతో పాటు మంచి భోజనం పెడతారు. క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి భోజనాలు తయారు చేయిస్తుంటారు. పెళ్లిళ్లు వాయిదా పడితే వీరికి కూడా ఇబ్బందే. అంతే కాకుండా శుభకార్యాల్లో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు, వాటిపై ఆధారపడి జీవించే యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల ఉపాధిపై దెబ్బపడనున్నది. ఇక ఫంక్షన్హాల్ నిర్వాహకుల పరిస్థితి చెప్పరానిది. ఇప్పటికే అడ్వాన్స్లు చెల్లించిన వారు తిరిగి తీసుకునే పరిస్థితి ఉంది. పెండ్లికి ఎందరు వస్తారో తెలియని స్థితిలో స్థానికంగా ఇంటి దగ్గర, లేదంటే గుడిలోనూ సాదాసీదాగా జరుపుకునే అవకాశం ఉంది. పెండ్లి పందిరి వేసేవారు, బ్యూటీషియన్లు, టైలర్లు, బంగారు ఆభరణాలు తయారు చేసే వారందరిపై ప్రభావం పడనున్నది.
జాగ్రత్తలు పాటించాలి
కరోనా కారణంగా శుభకార్యాలు చేసుకునేవారు జాగ్రత్తలు పాటించాలి. జూలై మాసం వరకు మంచి ముహూర్తాలు ఉన్నా యి. తేదీలు ఖరారు చేసుకున్నవారు పరిమి త సంఖ్యలో బంధుమిత్రులను ఆహ్వానించా లి. క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే.
అంజయ్యస్వామి, ఇంటర్నేషనల్ , వైశ్య ఫెడరేషన్ ఆధ్యాత్మిక రాష్ట్ర కమిటీ చైర్మన్
వస్త్ర వ్యాపారంపై దెబ్బ
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎంతో సరుకు తీసుకువచ్చాం. కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్నది. కరోనా కారణంగా శుభకార్యాలు వాయిదా వేసుకుంటారు. ఆడంబరాలు తగ్గించుకుంటారు. తక్కువ మొత్తంలో దుస్తులు కొంటారు. గత ఏడాది ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వర్కర్ల జీతాలు, కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఎన్నో ఉంటాయి.
ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం
కరోనా సెకండ్వేవ్ ఫంక్షన్హాళ్లపై ప్రభావం పడనున్నది. గత ఏడాది లాక్డౌన్ విధించడంతో ఫంక్షన్హాళ్లకు గిరాకీ లేదు. రాబోయే రోజుల్లో నిబంధనలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. గత ఏడాది కూడా కరోనా దెబ్బకు శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి.
-పాశికంటి శ్రీనివాస్, ఫంక్షన్హాల్ నిర్వాహకుడు