యాదాద్రి, జూన్ 20 : రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను సడలించిన నేపథ్యంలో ఆర్టీసీ సేవలు మరింత పెంచారు. తాజాగా అంతర్రాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యాదగిరిగుట్ట నుంచి కర్నూలుకు సర్వీసును పునఃప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం 45 ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామన్నారు. గత లాక్డౌన్ నేపథ్యంలో కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు 20 నుంచి 30 బస్సులను మాత్రమే నడుపుతున్న ఆర్టీసీ, తాజా సడలింపుతో సోమవారం నుంచి 45 ఆర్టీసీ బస్సులను వివిధ రూట్లలో నడిపించనున్నారు. గతంలో మాదిరిగానే జిల్లాలోని అన్ని రూట్లతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్కు బస్సులను అందుబాటులో ఉంచుతామన్నారు.
ప్రతి 15 నిమిషాలకు ఒక్క బస్సు చొప్పున హైదరాబాద్కు ఒక్కో బస్సు 3 ట్రిప్పులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో హైదరాబాద్కు 15 నిమిషాలకు ఒక్క బస్సు అందుబాటులో ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుకు సర్వీసులను నడిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంతర్రాష్ట్ర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దాదాపు రెండు నెలలుగా తెలుగు రాష్ర్టాల మధ్య బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో అంతర్రాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితోపాటు రాష్ట్రంలో వనపర్తి, అల్లంపూర్, మక్తల్, నారాయణఖేడ్ రూట్లలో బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు.
యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరి, నల్లగొండ, రాజాపేట, ఆలేరు నుంచి జగద్గిరిగుట్ట, యాదగిరిగుట్ట నుంచి ఉప్పల్కు బస్సులను నడిపినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. అద్దె వాహనాలను మాత్రం నడిపేందుకు అనుమతులు రాలేదన్నారు. 18,000 కిలోమీటర్ల వరకు 45 ఆర్టీసీ బస్సులను నడుపగా, సుమారుగా రూ.6 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఆర్టీసీ బస్సులకు శానిటైజేషన్ చేస్తున్నామని, బస్సుల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి బస్సులు ఎక్కేవిధంగా సూచనలు చేస్తున్నట్లు
తెలిపారు.