యాదాద్రి, మే 21 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, మాఢవీధులు, ప్రసాద విక్రయశాలతో పాటు ప్రధానాలయం సందడిగా మారింది. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనర్సింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలభోగం, స్వామికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్ర నామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు వైభవంగా జరుపగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చకున్నారు. క్యూ కాంప్లెక్స్ చెంత కొలువైన క్షేత్ర పాలకుడికి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండ కింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొని స్వయంభువులను దర్శించుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ.25,09,595 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తుల సౌకర్యాల కల్పనపై కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, ప్రసాద విక్రయశాలలోని కౌంటర్లను పరిశీలించారు. కొండ కింద గల లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్టను, భక్తుల మంచినీటి వసతులను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో చేపట్టాల్సిన వసతులపై ఆలయాధికారులకు పలు సూచనలు చేశారు.
శ్రీవారి సేవలో ఎమ్మెల్యే పైళ్ల
శ్రీవారిని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ప్రాకారంలోని అద్దాల మండపంలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు స్వామివారి ప్రసాదం అందించారు.
లక్ష్మీనరసింహుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి:రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శనివారం ఆమె యాదాద్రి లక్ష్మీనారసింహుడిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. మంత్రికి స్వామి ప్రసాదాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి ఆలయం రూపుదిద్దుకుందన్నారు.