యాదాద్రి భువనగిరి, జూన్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం, ఇటు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వాసాలమర్రిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన బాటలు వేసే దిశగా సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్న తరుణంలో ఆయన పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం వాసాలమర్రిలోనే మకాం వేసి ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆలేరు సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉండటంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిలు సీఎం పర్యటన విజయవంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం పర్యటనకు సంబంధించి పర్యవేక్షణ, ఏర్పాట్ల కోసం ఆరు కమిటీలను ఏర్పాటు చేసి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కమిటీలకు నేతృత్వం వహిస్తున్నారు. అలాగే గత రెండు రోజులుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు వాసాలమర్రిలో పర్యటిస్తూ ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో వస్తుండటంతో భువనగిరి నుంచి వాసాలమర్రి వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపుల పెద్దఎత్తున మొక్కలను నాటేలా చర్యలు చేపట్టారు.
గ్రామసభ, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామస్తులతో గ్రామాభివృద్ధిపై చర్చించేందుకు గ్రామసభను నిర్వహిస్తుండటంతో వాసాలమర్రిలోని హాస్టల్ వెనుక వైపున ఉన్న స్థలాన్ని ఇందుకు ఎంపిక చేశారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేయనుండటంతో గ్రామసభ నిర్వహిస్తున్న స్థలానికి కొద్ది దూరంలో ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ రెండు చోట్లా భూమిని చదును చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామానికి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా గ్రామసభ ప్రాంగణానికి వచ్చేందుకు ప్రాంగణం కుడి వైపున ఉన్న దేవాలయం నుంచి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతోపాటు నేతలు, అభిమానులు సైతం పెద్దఎత్తున రానుండటంతో సభా వేదిక ప్రాంతానికి వారంతా చేరుకునేలా అవసరమైన రూట్మ్యాప్ను రూపొందించే పనిలో పోలీస్శాఖ నిమగ్నమైంది. గ్రామసభను నిర్వహించే ప్రాంగణానికి ముందు వైపున 300 వాహనాలను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సీఎం ఇంటలిజెన్స్ అధికారుల బృందం వాసాలమర్రిని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వీరితోపాటు రాచకొండ జాయింట్ సీపీ సుధీర్బాబు, డీసీపీ నారాయణరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, జడ్పీ సీఈవో క్రిష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ కొల్పుల అమరేందర్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మ న్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్, ఎంపీపీ సుశీలారవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
ఎర్రవెల్లిని సందర్శించిన కలెక్టర్ పమేలాసత్పతి
కలెక్టర్ పమీలాసత్పతి సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఆదర్శ గ్రామాన్ని శనివారం సందర్శించారు. ఎర్రవెల్లి తరహాలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడంలో భాగంగా కలెక్టర్ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డితో కలిసి ఎర్రవెల్లిలో పర్యటించారు. ఒకప్పుడు గ్రామ పరిస్థితి.. అభివృద్ధి పనుల తర్వాత ఎర్రవెల్లి పురోగతిని ఈ సందర్భంగా అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణాలు, రోడ్లు, ముఖ్య కూడళ్లు, చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామసభ నిర్వహణ సందర్భంగా సీఎం కేసీఆర్ రచ్చబండపై కూర్చుని గామస్తులతో మమేకమై అభివృద్ధి విషయమై చర్చించే వారని తెలుసుకున్న కలెక్టర్ కొద్దిసేపు అదే రచ్చబండపై కూర్చున్నారు. ఎర్రవెల్లి గ్రామాభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళిక, ప్లాన్ను పరిశీలించారు. వాసాలమర్రి గ్రామాన్ని సైతం ఎర్రవెల్లి తరహాలో అన్ని హంగులతో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి పేర్కొన్నారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ భాగ్య భిక్షపతి, మాజీ సర్పంచ్ భాగ్య బాలరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డిలు ఉన్నారు.
కమిటీల ఏర్పాటు
స్టేజి ఇన్చార్జీలు : పడాల శ్రీనివాస్(తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్షుడు, బోడూరి రవీందర్(మాజీ ఎంపీపీ తుర్కపల్లి), బాలక్రిష్ణ(మల్లాపురం సర్పంచ్)
భోజం ఇన్చార్జీలు :గడ్డమీది రవీందర్గౌడ్(ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్), రవీందర్ నాయక్(తుర్కపల్లి ఎంపీపీ), యాకుబ్(మైనార్టీ సెల్ అధ్యక్షుడు), రహెమత్(కో-ఆప్షన్ సభ్యుడు)
వీవీఐపీ పార్కింగ్ ఇన్చార్జీలు : హరి నాయక్(మాదాపూర్ మాజీ సర్పంచ్), భాస్కర్ నాయక్(హరినాయక్తండా సర్పంచ్), వెంకట్రెడ్డి(గంధమళ్ల మాజీ సర్పంచ్)
జనరల్ పార్కింగ్ ఇన్చార్జీలు : శంకర్ నాయక్(తుర్కపల్లి యూత్ ప్రెసిడెంట్), బద్దునాయక్(ఏఎంసీ డైరెక్టర్), నామసాని సత్యనారాయణ(తిర్మలాపూర్ సర్పంచ్)
వాటర్ ఇన్చార్జీలు : ఆశబోయిన రాజయ్య(మాజీ ఎంపీటీసీ), పుట్టసాయి, కల్లూరి ప్రభాకర్ రెడ్డి(వెంకటాపురం సర్పంచ్), సుంకరి శెట్టయ్య(టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు)
ఎలక్ట్రిసిటీ ఇన్చార్జీలు : పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి(పీఏసీఎస్ మాజీ చైర్మన్), కొమిరిశెట్టి నర్సింహులు(ఆర్డిస్ చైర్మన్)