యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిలో భాగంగా పాతగుట్ట చౌరస్తా నుంచి సన్నిధి హోటల్ వరకు చేపట్టనున్న ప్రధాన రోడ్డు విస్తరణకు బాధితులు సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్తరణకు భూసేకరణ చేపడుతున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితుల నుంచి అభిప్రాయం సేకరించారు.
ఇప్పటికే శ్రీవారి వైకుంఠ ద్వార గాలిగోపురం నుంచి పాతగుట్ట చౌరస్తా వద్ద రోడ్డు కుడి వైపు 60, ఎడమవైపు 60 ఫీట్ల విస్తరించి ఆదునీకరిస్తున్నారు. దీంతో పాటు పాతగుట్ట చౌరస్తా నుంచి గుండ్లపల్లి గుండా సన్నిధి హోటల్ వరకు 120 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రోడ్డు బాధితులతో మాట్లాడి అభిప్రాయం సేకరించారు.
గతంలో ఇచ్చిన మాదిరిగానే నష్టపరిహారం, ఇంటి స్థలంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లో షాపును ఇవ్వాలని బాధితులు అదనపు కలెక్టర్కు తెలియజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తామని బాధితులకు తెలిపారు. మరో 10 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో సూరజ్కుమార్, తహసీల్దార్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.