యాదాద్రి భువనగిరి, మే 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వైద్య బృందాలు రెండు విడుతల్లో ఇంటింటా నిర్వహించిన జ్వర సర్వేను సక్సెస్ చేశాయి. మే 6 నుంచి 10వ తేదీ వరకు తొలి విడుతలో, మే 23 నుంచి 28వ తేదీ వరకు రెండో విడుతలో జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలిటీల పరిధిలోని 2,10,329 ఇండ్లల్లో 757 బృందాలు సర్వే నిర్వహించాయి. సర్వే సమయంలో ఎవరైనా జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతుంటే వారికి అక్కడికక్కడే హెల్త్ కిట్లను అందజేశారు. మొదటి విడుతలో 4,651 మందికి, రెండో విడుతలో 7,903 మందికి కిట్లను ఇండ్ల వద్దనే అందజేసి భరోసా కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన జ్వర సర్వేతో జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగానే నియంత్రించగలిగామని, పాజిటివ్ కేసులు సైతం గణనీయంగా తగ్గాయని అధికార యంత్రాంగం చెబుతుంది.
మందులు అందజేసి.. భరోసా కల్పించి..
రెండు విడుతల్లోనూ జిల్లాలో చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే బాధితుల్లో పూర్తి భరోసాను నింపింది. ఇంటింటికీ వెళ్లి ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన బృందాలు మందులు అందజేయడంతోపాటు బాధితుల్లో ధైర్యం నింపారు. ప్రతి వెయ్యి మందికి ఒక సర్వే బృందం చొప్పున.. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల పరిధిలో 1,16,876 ఇండ్లు ఉండగా, 625 జ్వర సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. 6 మున్సిపాలిటీల పరిధిలో 43,453 ఇండ్లు ఉండగా, 132 బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తిరిగి ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా జ్వరం, దగ్గు, జలుబు వంటి నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్న వారిని సర్వే బృందాలు గుర్తించాయి. గ్రామ పంచాయతీల పరిధిలో జ్వ రం ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారిని మొ దటి విడుతలో 3,475 మందికి హెల్త్ కిట్లను, రెం డో విడుత సర్వే సందర్భంగా 4,731మందికి కిట్ల ను అందజేశారు. అలాగే.. మున్సిపాలిటీల పరిధిలో రకరకాల రోగాలతో బాధపడుతున్న 1,176 మందిని గుర్తించి కిట్లను అందజేయగా, రెండో విడుతలో మరో 3,172 మందికి కిట్లను అందజేశారు. ఇంటింటి సర్వే సందర్భంగా ఫోన్ నంబర్లను కూడా సేకరించడంతో ప్రతిరోజూ వైద్య సి బ్బంది వారి ఆరోగ్య పరిస్థితిపై మానిటరింగ్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.