యాదాద్రి భువనగిరి, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెలు, పట్టణాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని అమలు చేస్తున్నది. గతానికి భిన్నంగా నెలనెలా నిధులు విడుదల చేసి ప్రగతికి తోడ్పాటునందిస్తున్నది. 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు ముప్పై రోజుల పాటు 421 పంచాయతీల్లో మొదటి విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత రెండో విడుతగా 2020 జనవరి 2 నుంచి 11 వరకు పది రోజులపాటు చేపట్టింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మొదటి విడుతలో 2020 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు నిర్వహించి..ఆ తర్వాత 2020 జూన్ 1 నుంచి 8 వరకు ప్రత్యేకంగా పారిశుధ్యంపై డ్రైవ్ చేపట్టింది. ఈ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి. పల్లెలు, పట్టణాలకు చాలా వరకు మౌలిక సదుపాయాలు ఒనగూరడంతోపాటు.. సమస్యలు సైతం పరిష్కారమయ్యాయి. ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలను భాగస్వాముల్ని చేయడంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లె, పట్టణాల రూపురేఖలు మారిపోయి ప్రభుత్వ సంకల్పం ఇప్పటికే చాలా వరకు నెరవేరింది.
మారిన పల్లెలు, పట్టణాల రూపురేఖలు
ప్రతి పల్లెలో ఉండాల్సిన కనీస పౌర సదుపాయాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. వార్డుల వారీగా ప్రణాళికలు తయారు చేయడంతోపాటు వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించి పక్కాగా అమలు చేశారు. అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టిపెట్టి మురుగు కాల్వలను శుభ్రపర్చడంతోపాటు, ముళ్లకంపలు, చెత్తా చెదారం లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు సరఫరా అయ్యేలా ప్రత్యేక శ్రద్ధపెట్టి అమలు చేశారు. విరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడంతోపాటు వీధుల్లో అంధకారం లేకుండా లైట్లను ఏర్పాటు చేయించారు. పల్లెల్లో చెత్త నిర్మూలనకు డంపింగ్ యార్డులు, చనిపోయిన వారికి గౌరవంగా తుది వీడ్కోలు పలికేందుకు వైకుంఠధామాల ఏర్పాటు, ఆహ్లాదాన్ని పంచేందుకు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు..తదితర మౌలిక సదుపాయాలకు కార్యరూపం ఇచ్చారు. ఫలితంగా జిల్లాలో 92 రైతు వేదికలు, 418 వైకుంఠధామాలు, 650 పల్లె ప్రకృతి వనాలు, 418 వర్మీకంపోస్టు యార్డులు చాలావరకు వినియోగ దశలో ఉండగా.. మిగతావి కూడా వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మున్సిపాలిటీల్లోనూ పారిశుధ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతోపాటు పట్టణాలు, నగరాల్లో ఉన్న సదుపాయాలను మున్సిపాలిటీల్లోనూ అందుబాటులోకి తెచ్చేలా పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణను మొదలుపెట్టింది. ఇదే స్ఫూర్తిని జూలై 1 నుంచి చేపట్టబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పది రోజుల కార్యక్రమం..పక్కాగా అమలు చేసేలా ..
జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మలివిడుతలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతుండటంతో పది రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పది రోజుల కార్యక్రమంలో పట్టణాలను సెట్రైట్ చేసుకోవాలని సూచించారు. ప్రతి పట్టణంలో నాలుగు డంపింగ్ యార్డులు, లక్ష జనాభాకు వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేసుకునేలా కార్యాచరణను తయారు చేసుకోవాలని స్పష్టం చేశారు. రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల సేవకులను పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించడంతో ఆదిశగా చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పది రోజుల కార్యక్రమాన్ని సక్సెస్ చేసేలా జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి ఆధ్వర్యంలో అవసరమైన ప్రణాళికలను రూపొందించే పనిలో ఆయా శాఖల అధికారులు నిమగ్నమయ్యారు.
నిధుల కొరత లేకుండా చర్యలు
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి ప్రభుత్వం క్రమం తప్పకుండా నెలనెలా టంచన్గా గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తూ వస్తున్నది. జనాభా ప్రాతిపాదికన 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కలిపి ప్రతి నెలా ఒక్కో పౌరుడికి రూ.132 చొప్పున ఏడాదికి రూ.1,632 చొప్పున నిధులను మంజూరు చేస్తున్నది. ఈ లెక్కన ప్రతి నెలా జిల్లాలోని 421 పంచాయతీలకు రూ.7కోట్లకు పైగా నిధులు విడుదల అవుతున్నాయి. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్భంగా ప్రభుత్వం ఎటువంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నది. జిల్లాల వారీగా ముందుగానే నిధులు విడుదల చేస్తున్నది. ఒక్కో అదనపు కలెక్టర్ పరిధిలో అసంపూర్తి పనుల కోసం ప్రతి జిల్లాకు రూ.25లక్షలు విడుదల చేస్తూ ప్రణాళికశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ఖర్చుచేసేందుకు ప్రత్యేకించి జిల్లా మంత్రికి రూ.2కోట్లు, జిల్లా కలెక్టర్కు క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ కింద రూ.కోటి నిధులు సమకూర్చేలా ప్రభుత్వం తాజాగా..ఉత్తర్వులను జారీ చేసింది. పల్లె ప్రగతిలో చేపట్టిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, మొక్కల పెంపకం, నర్సరీలు, రైతు కల్లాల ఏర్పాటు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టగా..చాలాచోట్ల అసంపూర్తి దశలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉపాధిహామీ పథకం కింద ఇటీవలనే నిధులు మంజూరు చేశారు.
విస్తృతంగా మొక్కలు నాటేలా..
వర్షాలు కురుస్తుండడంతో హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా జిల్లా యంత్రాంగం కార్యాచరణను రూపొందించుకున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్భంగా అనువైన ప్రతిచోటా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గుంతలు తీసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఏడో విడుత హరితహారంలో జిల్లా వ్యాప్తంగా 30 లక్షలు మొక్కలు నాటేలా టార్గెట్ పెట్టుకోగా..12 శాఖల అధికారులు శాఖల వారీగా టార్గెట్లను నిర్దేశించుకున్నారు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా..పొలం గట్ల వెంట.. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటనున్నారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచేలా ప్రజలను అధికారులు చైతన్యపర్చనున్నారు. ఈ మేరకు ప్రతి ఇంటికి పండ్లు, పూల రకాలకు సంబంధించి ఆరు మొక్కలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.