జిల్లాలో 3,288 మంది గుర్తింపు
17 మండలాలకు 9 కేంద్రాల ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రానికి ఉదయం 7 గంటలకే చేరుకోవాలి
గూగుల్మీట్లో కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి కలెక్టరేట్, మే 27 : జిల్లాలో గుర్తించిన సూపర్ స్ప్రెడర్లకు ఈనెల 28, 29వ తేదీల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో గూగుల్మీట్ నిర్వహించి సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్పై తగు మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వైరస్ బారిన పడటానికి ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న వారిని గుర్తించి అందించాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని, అందులో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 962 మంది చౌక ధరల దుకాణాల డీలర్లు, వర్కర్లు, పెట్రోల్ బంకు డీలర్లు, వర్కర్లు ఉన్నారు. 1150 మంది ఎల్పీజీ గ్యాస్ డీలర్లు, వర్కర్లు. 479 మంది అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు. 697 మంది మందులు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విత్తనాలు, డీలర్లు వర్కర్లను సూపర్ స్ప్రెడర్లుగా జిల్లా యంత్రాంగం గుర్తించిందన్నారు. ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండి సూపర్స్ప్రెడర్లను గుర్తించి వ్యాక్సినేషన్ ఇప్పించాలన్నారు.
తహసీల్దార్లు, పౌర సరఫరాల అధికారులు, ఇతర మండల స్థాయి అధికారులు చౌకధరల దుకాణాల డీలర్లకు, వర్కర్లకు, ఎల్పీజీ డీలర్లు, వర్కర్లు, పెట్రోల్బంకు డీలర్లు, వర్కర్లను, అక్రిడిటేషన్ జర్నలిస్టులకు కరోనా వ్యాక్సినేషన్ ఇప్పించాలన్నారు. జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుతోపాటు ఆధార్కార్డు తీసుకెళ్లాలని కోరారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తన విక్రయ డీలర్లు, వర్కర్లకు వ్యవసాయ విస్థరణాధికారులు ఆయా కేంద్రాల్లో గుర్తించి వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ కోసం గుర్తించిన 9 కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పారిశుధ్య చర్యలు, తాగునీటితోపాటు ఇతర సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది, ప్రత్యేక అధికారులు నిర్ధేశించిన సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరుకోవాలని, జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఉదయం 7 గంటల లోగా జాబితాలతో వ్యాక్సినేషన్ గల 9 కేంద్రాలకు అధికారులు చేరుకోవాలని ఆదేశించారు. పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించుకుని సూపర్ స్ప్రెడర్లకు కట్టుదిట్టంగా వ్యాక్సినేషన్ అందించాలని, ఈ విషయంలో నిర్లక్షం చేస్తే ఉపేక్షించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ గూగుల్మీట్లో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పరిపూర్ణాచారి తదితరులు ఉన్నారు.