కొవిడ్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు
జిల్లాలో నాలుగో రోజు కొనసాగిన జ్వర సర్వే
జిల్లా వ్యాప్తంగా 1,88,307 ఇండ్లల్లో సర్వే పూర్తి
5,972 మంది బాధితులకు హెల్త్ కిట్లు అందజేత
కేసులు తగ్గుముఖం పడుతున్నాయంటున్న అధికారులు
యాదాద్రి భువనగిరి, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యూహం ఫలిస్తున్నది. వ్యాధి ముదరకముందే ఇండ్ల వద్దనే రోగులను గుర్తించి, వారికి చికిత్స అందించేందుకు జిల్లాలో రెండో విడుతలో చేపడుతున్న జ్వర సర్వే సత్ఫలితాలు ఇస్తున్నది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నవారిని ఇంట్లోనే ఉంచి ప్రత్యేక మెడికల్ కిట్లు ఇవ్వడంతోపాటు మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి సమగ్ర చికిత్సను అందిస్తున్నారు. 421 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో వైద్య బృందాలు నాలుగు రోజుల్లో మొత్తం 1,88,307 ఇండ్లల్లో సర్వేను పూర్తి చేశాయి. జ్వరం, ఇతర కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి 5,972 మందికి కిట్లు అందజేశారు. రెండు విడుతల్లో చేపట్టిన జ్వర సర్వేతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
భువనగిరిలో..
భువనగిరి అర్బన్, మే 26: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని వడపర్తిలో బుధవారం నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వైద్య సిబ్బందికి చెబితే వ్యాధికి సంబంధించిన మందులు అందజేస్తారని చెప్పారు. ఎలాంటి లక్షణాలు ఉన్నా భయపడకుండా చెప్పాలని, జలుబు, దగ్గు, జ్వరం వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి మణేమ్మ, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చొల్లేరులో …
యాదగిరిగుట్ట రూరల్, మే 26 : జ్వరం, జలుబుతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత ఇంటింటి జ్వర సర్వే బుధవారం మండలంలో కొనసాగింది. మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. జ్వరం తదితర లక్షణాలు ఉన్న వారికి అక్కడే ప్రభుత్వం నుంచి ఇచ్చిన కొవిడ్ కిట్లను అందించారు. సర్వేను యాదగిరిగుట్ట ఎంపీడీవో కారం ప్రభాకర్రెడ్డి, ఎంపీవో చంద్రశేఖర్ పరిశీలించారు.
కొలనుపాకలో…
ఆలేరురూరల్,మే 26: ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడుత జ్వర సర్వే మండలం వ్యాప్తంగా కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, అంగన్వాడీ, ఆశవర్కర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో
ఆత్మకూరు(ఎం), మే 26: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలతో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కొనసాగింది. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, వంటి నొప్పులు ఉన్నవారిని గుర్తించి పేర్లు నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
వలిగొండలో
వలిగొండ, మే 26: మండలంలోని అన్ని గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం రెండో విడుత ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. 40 బృందాలతో నిర్వహించిన ఇంటింటి సర్వేలో 2243 ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 53 మందికి మెడికల్ కిట్లు అందజేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.