ఇరిగేషన్కు సంబంధించి ఏ ఒక్క పనీ పెండింగ్లో ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన మరుసటి రోజే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కార్యక్షేత్రంలోకి దిగారు. జిల్లాను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం 14, 15 ప్యాకేజీ పనులను బుధవారం కూలంకషంగా పరిశీలించారు. మండుటెండను లెక్క చేయకుండా 40 కిలోమీటర్ల మేర కాల్వ గట్ల వెంట ప్రయాణించి పనులు పరిశీలించారు. మధ్యమధ్యలో పనుల పురోగతిని తెలుసుకుంటూనే.. అధికారులకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మంత్రి వెంట ఉండి పనులను పరిశీలించారు. సాయంత్రానికి బస్వాపూర్ (నృసింహ) రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకున్న మంత్రి పనులు జరుగుతున్న చోటనే కలెక్టర్ అనితారామచంద్రన్, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్రావు, హరేరామ్లతో రాత్రి 8గంటల వరకు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా భూసేకరణ, పునరావాస చర్యలపైనా మంత్రి చర్చించారు. మెయిన్ కెనాల్ పనులు 63 శాతం పూర్తయ్యాయని.. మిగతా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
– యాదాద్రి భువనగిరి, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ తుర్కపల్లి, మే 26 : జిల్లాను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈనెల 25న ప్రగతి భవన్లో వానకాలం సాగు, నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి సమన్వయంతో ఇరిగేషన్ పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో బుధవారమే మంత్రి జగదీశ్ రెడ్డి రంగంలోకి దిగారు. 14, 15 ప్యాకేజీ పనులు జరుగుతున్న 40 కిలోమీటర్ల మేర కాల్వ గట్ల వెంట పర్యటించి పనులను పరిశీలించారు. 14, 15 ప్యాకేజీ జంక్షన్ నుంచి కొడకండ్ల, తిగుళ్ల, జగదేవ్పూర్, వీరారెడ్డి పల్లి, తుర్కపల్లి, మొలకపల్లి, జంగంపల్లి గ్రామాల మీదుగా సాగుతున్న కాల్వ లైనింగ్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. కోనాపురం, తుర్కపల్లితో పాటు 16వ ప్యాకేజీ ప్రారంభమయ్యే ముల్కలపల్లి వరకు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మల్లన్నసాగర్ నుంచి విడుదలయ్యే కాళేశ్వరం నీళ్లు 15, 16 ప్యాకేజీల పరిధిలో 36 కిలోమీటర్ల మేర ప్రయాణించి గంధమళ్లకు చేరుకునేలా డిజైన్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. గంధమళ్లకు రిజర్వాయర్లోకి 2,450 క్యూసెక్కుల నీరు చేరుతుందని, జగదేవ్పూర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ నుంచి 6,457 ఎకరాల ఆయకట్టుకు, ఎల్ఎంసీ నుంచి 37,814 ఎకరాలకు, ఆర్ఎంసీ నుంచి 19,019 ఎకరాలకు నీరు పారేలా డిజైన్ చేసినట్లు వివరించారు.
బస్వాపూర్ రిజర్వాయర్ వద్దే సమీక్ష
మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన మంత్రి క్షేత్రస్థాయి పర్యటన ఆసాంతం మండుటెండలోనే సాగింది. నిర్విరామంగా పనుల పరిశీలన జరిపిన అనంతరం మంత్రి సాయంత్రానికి బస్వాపూర్(నృసింహ) రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. తొలుత కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించాలనుకున్నప్పటికీ వేదిక బస్వాపూర్ రిజర్వాయర్కు మారింది. పనులు జరుగుతున్న చోటనే మంత్రి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావు, గజ్వేల్ ఈఎన్సీ హరేరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులేమిటి? మిగతా పనులు ఎప్పటిలోపు పూర్తవుతాయన్న విషయాలపై మంత్రి క్షుణ్ణంగా సమీక్ష జరిపారు. భూసేకరణ ప్రక్రియ, పునరావాసం తదితర అంశాలపై కూడా చర్చించిన మంత్రి ఆయా ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే అందరూ సమన్వయంతో వ్యవహరించి మిగిలిన కెనాల్ పనులను నిర్దేశించిన సమయానికి వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
జూలై నెలాఖరునాటికి బస్వాపూర్కు నీళ్లు
ఈ ఏడాది జూలై నెలాఖరునాటికి బస్వాపూర్ రిజర్వాయర్కు కాళేశ్వరం జలాలను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో రోజులుగా జిల్లా ప్రజానీకం కాళేశ్వరం నీళ్లకోసం ఎదురుచూస్తున్న తరుణంలో మంత్రి బుధవారం బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద విలేకరులతో మాట్లాడిన సందర్భంగా స్పష్టత ఇచ్చారు. భువనగిరి, ఆలేరు ప్రాంతాలను కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కాల్వపనులు 63 శాతం వరకు పూర్తయ్యాయని మిగతా పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. భూ పరిహారం చెల్లింపుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న సీఎం సంకల్పం నెరవేరుతున్నదని పేర్కొన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ వి.శ్రీనివాస్, ఈఈలు ఖుర్షీద్, రఘునాథ్ ప్రసాద్, డిఈలు కవిత, శైలేంద్ర, రూప్లా ,ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ బిక్కునాయక్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూ నాయక్, ముల్కలపల్లి సర్పంచ్ మల్లప్ప, భాస్కర్ నాయక్, నీటిపారుదల, విద్యుత్ శాఖ ఏఈలు పాల్గొన్నారు.