యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలో.. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భవించింది. అప్పట్లో ఉద్యమ ఊపిరిగా మారిన కేసీఆర్.. రాష్ట్రంలో అన్నివర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితిని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఫలితంగా..దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే ఉద్యమ పార్టీ.. ఇప్పుడు రాజకీయ పార్టీగా దూసుకువెళ్తున్నది. 2014లో జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2018లో మరోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించింది. నేటికీ బలమైన శక్తిగా కొనసాగుతూ.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగింది టీఆర్ఎస్ పార్టీ.
ఊర్రూతలూగిన మలిదశ ఉద్యమం
తెలంగాణ సాధన మలిదశ ఉద్యమం భువనగిరి గడ్డపై ఉవ్వెత్తున సాగింది. అయితే ఈ ఉద్యమంలో ఆలేరు నియోజకవర్గం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ముందువరుసలో నిలిచింది. సకలజనుల సమ్మె, తెలంగాణ ధూంధాం, మిలియన్ మార్చ్, వంటావార్పు, పెన్డౌన్ వంటి వినూత్నరీతిలో ప్రదర్శనలు ఈ ప్రాంతంలో జరిగాయి. కేసీఆర్ భువనగిరి గడ్డపై జరిగిన ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను నలుమూలలా చాటారు. తొలి దశ ఆందోళనలో భాగంగా..చేనేత కార్మికుల కోసం 2002 మే 22న కేసీఆర్ భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ విరాళాల సేకరణలో భాగంగా.. యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరులో పీఈఎల్ కంపెనీలో పార్టీ చందా కోసం కేసీఆర్ కార్మికుడిగా మారారు. 2008లో పల్లెనిద్రలో భాగంగా మోటకొండూర్ సమీపంలో గల వర్టూర్లో ఆయన బస చేశారు. మోటకొండూర్ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చాడముత్తిరెడ్డిగూడెంలో గ్రామస్తులు వినూత్న రీతిలో చేపట్టిన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలువగా.. అప్పటి ఉద్యమ నాయకుడు ధూం ధాం అధినేత రసమయి బాలకిషన్, జేఏసీ చైర్మన్ కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, సోమారపు సత్యనారాయణ పాల్గొని మద్దతు పలికారు. 2001లో ఆలేరు పట్టణంలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 2012లో గుండాల మండలంలో ధూం ధాంలో తన్నీరు హరీశ్రావు, తెలంగాణతల్లి విగ్రహావిష్కరణలో దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిలోనూ ఉద్యమ పార్టీ కీలక భూమిక
రాష్ట్ర ఏర్పాటు తర్వాత..కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వేరుపడి 2016లో పురుడు పోసుకున్న జిల్లా గడిచిన ఆరేండ్లలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మెట్టు మెట్టుకో ప్రగతి సాధిస్తూ అభివృద్ధి శిఖరానికి చేరుకుంటోంది. సాగు, తాగు నీటిపరంగానే కాకుండా..అభివృద్ధి, సంక్షే మ పథకాల పరంగానూ అన్నివర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేరువైంది. ఉద్యమ నేతలే.. కీలక పదవుల్లో కొనసాగుతుండగా.. విప్లవాత్మకరీతిలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణ..పారదర్శక విధానాల ఫలితంగా అతితక్కువ కాలంలోనే జిల్లా అద్భుత ఫలితాలు సాధించింది. రూ.2 వేల కోట్ల అంచనాతో యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం పూర్వ వైభవాన్ని చాటుతోంది.
బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుండగా.. చౌటుప్పల్తో పాటు పలుచోట్ల ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులతో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. రవాణా, విద్యాపరంగానూ జిల్లా గణనీయమైన అభివృద్ధి సాధించగా బీబీనగర్లో ఏర్పాటైన మహిళా సైనిక్ స్కూల్, రీజినల్ రింగ్ రోడ్డు వంటివి జిల్లాకు కీర్తికిరీటంలా నిలుస్తున్నాయి. కరువు ఛాయలు చెదిరిపోయి.. పుట్లకొద్ది ధాన్యపు రాశులు కళ్లెదుట కళకళలాడుతుండగా..గుండాల, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని బీడు భూముల్లో పారుతున్న గోదావరి జలాలను చూసి రైతాంగం మురిసిపోతోంది. రూ.970.34కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో 772 ఆవాసాలకు శుద్ధమైన గోదావరి, కృష్ణా జలాలు గడపగడపకూ అందుతున్నాయి. టీఆర్ఎస్ పాలనలో ఓవైపు సంక్షేమం..మరోవైపు అభివృద్ధి జిల్లా ముఖచిత్రంపై కండ్ల ఎదుట సజీవంగా సాక్షాత్కరిస్తోంది.
గుండెల్లో గూడుకట్టుకున్న ‘గులాబీ’ పార్టీ
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సబ్బండ వర్ణాలకు గొడుగులా నీడనిచ్చి అండగా నిలుస్తున్నాయి. రైతు బంధుతో ఎవుసానికి ఆసరా కాగా.. ఇంటి పెద్దను కోల్పోయి చిన్నాభిన్నమైన కుటుంబాలకు రైతు బీమా పెద్ద దిక్కుగా నిలిచింది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. ఇలా ఎన్నో పథకాలు విధి రాతకు ఎదురు నిలిచే ధైర్యాన్నిచ్చాయి. ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న అనేక కుటుంబాలు సాఫీగా సాగేలా భరోసా కల్పించాయి. వందలకొద్దీ సంక్షేమ పథకాలను అమలుచేయడం ద్వారా సీఎం కేసీఆర్ ఇంటి పెద్దగా నిలిచి ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ వేల కుటుంబాలు ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందాయి.
పార్టీలకతీతంగా ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపిన గులాబీ పార్టీని ఆయా కుటుంబాలు ఇంటి పార్టీగా భావిస్తున్నాయి. గుండె గుండెల్లో గులాబీ పార్టీ గూడుకట్టుకోగా.. ఆ అభిమానం రెండు నెలల క్రితం చేపట్టిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో స్పష్టంగా కనిపించింది. లక్షాయాభైవేల వరకు టీఆర్ఎస్ సభ్యత్వాలు స్వీకరించారు. స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు కుటుంబాలకు కుటుంబాలే ముందుకు వచ్చాయి. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే అవుతుండగా.. 2014 నుంచి జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారు. వార్డు సభ్యుడు మొదలుకుని.. జిల్లా స్థాయిలోని ప్రతి పదవిలోనూ మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ వర్గీయులే ఉన్నారు.