యాదాద్రి భువనగిరి, జూన్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్రగతి’, ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాలతో పట్టణ, గ్రామ పాలన కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రభుత్వం రూ.కోట్లలో నిధులను నెలనెలా మంజూరు చేస్తుండటంతో ఎటుచూసినా అభివృద్ధి వెల్లివిరుస్తున్నది. కరోనా పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పటికీ అభివృద్ధి పనులను చేపట్టే విషయంలో సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయక ఉదారంగా నిధులను విడుదల చేస్తూ వస్తున్నారు. కేంద్రం నుంచి నిధుల విడుదల్లో ఆలస్యం అయినప్పటికీ నెలనెలా ప్రభుత్వం మున్సిపాలిటీలు, పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నది. గతంలో గ్రామ పంచాయతీలకే నిధుల కేటాయింపు జరుపగా.. జిల్లా పరిషత్లు, మండల పరిషత్లకు సైతం భారీగా నిధులను కేటాయించి తెలంగాణ ప్రభుత్వం నూతన శకానికి నాంది పలికింది. ప్రతి గ్రామ పంచాయతీలో సాధారణం కంటే అధికంగానే నిధులు అందుబాటులో ఉండగా, అదనంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడంతో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో అభివృద్ధి కొనసాగనుంది.
సంక్షోభ పరిస్థితుల్లోనూ ఆర్థిక భరోసా..
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం విషయంలో ఎక్కడా వెనుకకు తగ్గడంలేదు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో కొన్ని పొదుపు చర్యలను పాటిస్తూనే ఆ నిధులను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తున్నది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు వంటి పథకాలను కొనసాగించి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూనే అభివృద్ధిని సైతం నెరవేరుస్తూ వస్తున్నది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులను మంజూరు చేస్తూ వస్తున్నది. అలాగే ప్రతినెలా సగటున రూ.7కోట్లకు పైగానే ప్రభుత్వం జిల్లాలోని 421 పంచాయతీలకు నిధులను విడుదల చేస్తున్నది. ఇప్పటివరకు ఆర్థిక సంఘం నిధుల్లో వంద శాతం గ్రామ పంచాయతీలకే కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన నిధుల్లో మాత్రం ఈసారి జిల్లా పరిషత్లు, మండల పరిషత్లకు సైతం ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. గ్రామ పంచాయతీలకు 85శాతం, మండల పరిషత్లకు 10శాతం, జిల్లా పరిషత్లకు 5శాతం చొప్పున నిధుల కేటాయింపు జరుగుగున్నది. 2011 జనాభా ప్రాతిపదికన మూడు విభాగాల్లో సాధారణ, ఎస్టీ, ఎస్సీల కేటగిరీల వారీగా నిధులను ఖర్చు చేస్తున్నారు. తాజా నిర్ణయం నేపథ్యంలో గ్రామ పంచాయతీలతోపాటు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మండల, జడ్పీలకు సైతం ఆర్థిక భరోసా కలుగుతున్నది.
జిల్లాకు రూ.108.75 కోట్లు మంజూరు
వాసాలమర్రి గ్రామ పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలు, పంచాయతీలకు భారీగా నిధులను మంజూరు చేయడం గొప్ప ఊరటనిస్తోంది. ఇంతకు ముందే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని మున్సిపాలిటీలు, పంచాయతీలకు వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయగా, తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాపై కరుణ చూపి నిధులను ప్రకటించారు.
జిల్లాలోని 421 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.25లక్షల చొప్పున రూ.105.25 కోట్లను ముఖ్యమంత్రి నిధి నుంచి, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీలకు రూ.50లక్షల చొప్పున మొత్తం రూ.3.50కోట్లను స్పెషల్ ఫండ్ నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పురోగతిలో ఉండగా, పల్లెప్రగతిలో భాగంగా ప్రతీ పంచాయతీలో పచ్చదనం..పరిశుభ్రత కార్యక్రమాలతోపాటు వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా చేపడుతున్నది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు పెద్దమొత్తంలో నిధులను మంజూరు చేయడంతో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రగతి మరింతగా పరుగులు పెట్టనున్నది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
తుర్కపల్లి మండలం వాసాలమర్రి పర్యటనలో భాగంగా జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.25లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉన్నది. ఇందుకు గాను సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. గతంలో గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపులేక అభివృద్ధి జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. – వడ్ల నవ్యాశోభన్బాబు, శ్రీనివాస్పురం గ్రామం, ఆలేరు రూరల్
గ్రామాల మరింత అభివృద్ధి
భువనగిరి అర్బన్, జూన్ 23: సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల నిధు లు కేటాయించడంతో గ్రామా లు మరింత అభివృద్ధి చెందుతాయి. రానున్న రోజుల్లో గ్రా మాలు పట్టణాలుగా మారుతాయి. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లం ప్రజల అదృష్టం. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే చేపట్టాల్సిన ప్రణాళికను వాసాలమర్రి సభ ద్వారా మాకు అర్థమైంది. కలిసికట్టుగా, పట్టుదలతో గ్రామంలో సాధించని పనిలేదన్నారు.
అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్ నిలుస్తారు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారూ పల్లెల అభివృద్ధి ప్రదాతగా నిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 421 గ్రామపంచాయతీలకు రూ.25లక్షలు, భువనగిరి మున్సిపాలిటీకి రూ.కోటి, మిగిలిన ఐదు మున్సిపాలిటీలకు రూ.50లక్షల చొప్పున మంజూరు చేయడం శుభపరిణామం. మా మండలంలో 18 గ్రామపంచాయతీలు ఉంటాయి. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.25లక్షలు రావడం పట్ల సంతోషంగా ఉన్నది. దీంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షిస్తున్నా. మా నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని చేస్తున్న అభివృద్ధి అద్భుతంగా ఉన్నది. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలనే సంకల్పంతో కేసీఆర్ పాలన సాగిస్తున్నారు.