రామగిరి, మే 21: కరోనా విపత్కర పరిస్థితిలో ప్రైవే ట్ పాఠశాలల్లో పనిచేస్తు న్న టీచర్లు, సిబ్బందికి యూ-డైస్తో సంబంధం లేకుండా రెండో విడుతలో అందిస్తామన్న సాయం అందింది. గురు,శుక్రవారంలో లబ్ధిదారుల మొబై ల్ నెంబర్లకు మెసేజ్లు వస్తున్నాయి. అదే విధంగా వారు ఎక్కడ బియ్యం తీసుకోవాలనే వివరాలతో కూడిన రేషన్ దుకాణం నెంబర్ వివరాలను సహితం అందాయి. కాగా యూ-డైస్తో సంబంధం లేకుండా రెండో విడుతలో సాయం పొందిన వారిలో ఉమ్మడి జిల్లాలో టీచర్స్, సిబ్బంది 5,537 మంది ఉన్నారు. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అన్ని మండలాల ఎంఈవోలకు చేరవేయడంతోపాటు టీచర్లు, సిబ్బంది వాటిని తీసుకునే విధంగా చూసి ప్రతి రోజూ వివరాలు పంపించాలని డీఈవో ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి విడుతలో యూ-డైస్లో ఒక్కొక్కరికి రూ.2వేలు, 25కేజీ ల సన్నబియ్యం అందాయి. యూ-డైస్లో నమోదుకాని వారికి రెండో విడుత అందిస్తామని ప్రభుత్వం వెల్లడించగా ఉమ్మడి జిల్లాలో 5,537 మంది ఎంపికయ్యారు.
25వరకు రేషన్ దుకాణాల్లో బియ్యం …
కొవిడ్ నిబంధనలు, లాక్డౌన్ సూచనల మేరకు ప్రైవేట్ ఉపాధ్యాయులు, టీచర్స్కు ఈనెల 21నుంచి 25వరకు వారికి కేటాయించిన రేషన్ దుకాణాల్లో బియ్యం అందించనున్నారు. అందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఆరుగంటల నుంచి 10 గంటలలోపు అక్కడికి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి ఉం టుంది. తొలివిడుత వచ్చిన వారు మే మాసం బియ్యం 25కేజీలను సహితం తీసుకువెళ్లే విధంగా ఆదేశాలు అందినట్లు సమాచారం. ఏప్రిల్లో బియ్యం తీసుకోని టీచర్లు, సిబ్బంది మేలో రెండు నెలలకు సంబంధించిన బియ్యం తీసుకునే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది.
వివరాలు పంపించాలి
జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలు విధిగా ప్రైవేట్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి రెండో విడుతలో ఉన్నవారికి ప్రభుత్వ సాయం అందించిన విషయం ఆయా పాఠశాలల నిర్వహకులకు తెలియచేయాలి. అంతే కాకుండా వారికి కేటాయించిన రేషన్ దుకాణాల్లో 25కేజీల బియ్యం తీసుకువెళ్లారా..? లేదా .. ఎంతమంది తీసుకున్నారో ప్రతి రోజూ ఆ వివరాలను జిల్లా విద్యాశాఖకు ఉదయం 10:30 గంటలలోగా అందించాలని ఆదేశించారు. తొలి విడుత వచ్చిన వారికి మే మాసం బియ్యం తీసుకోవాలని కోరారు. గత మాసంలో బియ్యం తీసుకోని వారు రెండు మాసాల బియ్యం వెంటనే తీసుకోవాలి.
-బి.భిక్షపతి, డీఈవో – నల్లగొండ