భువనగిరి అర్బన్, జూలై 20: పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో ఆశాఖ డైరెక్టర్ సత్యనారాయణతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత స్థానిక కౌన్సిలర్లు, అధికారులదేనని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోని లే-అవుట్స్ ఆడిట్ చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు 10శాతం భూమి కంటే తక్కువ కేటాయిస్తే రికవరీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. 2014 తర్వాత అధికారిక లే-అవుట్స్ అనుమతి పొంది ఉండి 10 శాతం భూమి మున్సిపాలిటీకి స్వాధీనపర్చకుంటే సంబంధిత యజమాని నుంచి ఆ భూమి ధర మీద 10శాతం పైన్ కింద వసూలు చేయాలని సూచించారు.
మున్సిపాలిటీల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో భాగంగా ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూములను 25 ఎకరాల మేరకు గుర్తించి మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు పాంపాలని, ఆ భూమిలో అధికారికంగా లే-అవుట్స్ రూపొందించి సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు స్వయంగా సెంట్రల్ నర్సరీలు పెంచేందుకు భూములు గుర్తించాలన్నారు. పారిశుధ్య చర్యలు చేపట్టి ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్పరెన్స్లో కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.