నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తొమ్మిదో రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. గురువారం ఉదయం 10 గంటల తర్వాత వాహనాలు, జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సమయంలోనే ప్రజలు బయటకు వచ్చి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి లాక్డౌన్కు సహకరిస్తుండటంతో పల్లెలు, పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు సైతం అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. వ్యాపారులు కూడా 10 గంటలలోపే తమ వర్తక, వ్యాపారాలను మూసివేశారు.
మోత్కూరు, మే 20: మోత్కూరు, గుండాల మండలాల్లో గురువారం లాక్డౌన్ సంపూర్ణంగా జరిగింది. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో, గుండాల మండల కేంద్రంలో సడలింపు సమయం ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు షాపులను వ్యాపారులు తెరిచి ఉంచారు. ఈ సమయంలో గ్రామాల నుంచి నిత్యావసర సరుకులు, ఇతర పనుల కోసం వచ్చే వారితో పట్టణ వీధులన్నీ సందడిగా మారాయి. 10 గంటల తర్వాత బయట తిరుగుతున్న వాహనదారులను ఎస్ఐ ఉదయ్కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు.
బీబీనగర్, మే20 : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో లాక్డౌన్కు ప్రజలు స్వచ్ఛం దం గా సహకరిస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటలలోపే ప్రజలు తమ పనులను ముగించుకొని ఎవరి ఇండ్లకు వారే పరిమితం కావడంతో మండలంలోని ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనవసరంగా బయట తిరుగుతున్న వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
తుర్కపల్లి, మే20 : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో 9వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6నుంచి 10గంటల వరకు వ్యాపారులు షాపులను తెరిచి ఉంచారు. మండల కేంద్రంలోని చెక్పోస్టు వద్ద ఎస్ఐ మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన వాహనాలను ఆపి జరిమానా విధించారు.
ఆత్మకూరు(ఎం), మే 20: మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ప్రజలు సడలింపు సమయంలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. అనం తరం ఇండ్లకే పరిమితం కావడంతో ప్రధాన, అంతర్గత వీధులు నిర్మానుష్యంగా మారాయి.
రాజాపేట, మే 20 : మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు వేళల్లో షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసరాలను కొనుగోలు చేశారు. పోలీసులు పొట్టిమర్రి చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ శ్రీధర్రెడ్డి ప్రజలకు సూచించారు.
యాదగిరిగుట్ట రూరల్, మే 20 : యాదగిరిగుట్ట మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం లాక్డౌన్ సంపూర్ణంగా జరిగింది. యాదగిరిగుట్ట ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి మండలంలోని అన్ని గ్రామా ల్లో పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
యాదాద్రి, మే20: కొవిడ్ సెకండ్ వేవ్ కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ యాదగిరిగుట్ట పట్టణంలో 9వ రోజైన గురువారం సంపూర్ణంగా సాగింది. సడలింపు సమయంలో మాత్రమే ప్రజలు రోడ్లపైకి వచ్చి వస్తువులను కొనుగోలు చేసి తిరిగి ఇండ్ల పరిమితమయ్యారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఉదయం 10 గంటల నుంచే పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో యాదగిరిగుట్ట పట్టణ రహదారులు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం బోసి పోయాయి. యాదగిరిగుట్ట మండలంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 35 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ సైదులు తెలిపారు. వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని వదిలిపెట్టామని అన్నారు.
రామన్నపేట మే20: రామన్నపేట మండలంలో గురువారం లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 గంటలకే వ్యాపారులు దుకాణాలను మూసి వేయడంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గ్రామాల్లో సైతం లాక్డౌన్కు ప్రజలు సహకరిస్తూ ఇండ్ల నుంచి బయటకు రావడంలేదు. పోలీస్ చెక్పోస్ వద్ద ఎస్ఐ చంద్రశేఖర్ వాహనాల తనిఖీలు చేపట్టారు. పెట్రోలింగ్ నిర్వహించారు.
అడ్డగూడూరు, మే 20 : మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్డౌన్ 9వరోజు ప్రశాంతంగా జరిగింది. అన్ని గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 10 వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు.
రాజాపేట, మే20 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 25 మందికి ఒక్కొక్కరికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి గురువారం తెలిపారు. అదే విధంగా రెండు బైకులను సీజ్ చేశామన్నారు.