యాదాద్రి, సెప్టెంబర్13: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి పూజలు కొనసాగాయి. శివుడికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. విశేషసంఖ్యలో భక్త జనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నర పాటు శివుడ్నికొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. శివాలయం ఉపప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ నిర్వహించారు. యాదాద్రీశుడి నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శననారసింహహోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని సామూహిక వ్రతమాచరించారు.