కరోనా సోకితే అధైర్య పడకండి..
యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాల్లో కొవిడ్ ఐసొలేషన్ కేంద్రం
భవనాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
యాదాద్రి, మే 18 : కరోనా సోకితే భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, మనోధైర్యమే కరోనాకు దివ్య ఔషధమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. చాలా మంది భయంతోనే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, వైద్యం కోసం, అటూ ఇటు తిరుగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా నిర్మించిన బాలికలు, బాలుర వసతి గృహాల్లో ఆర్యవైశ్య సంఘం, వాసవి, రోటరీక్లబ్ ఆధ్వర్యంలో కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని భవనాలను పరిశీలించారు. ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. కరోనా బారినపడిన వారికి సాయం చేయాలని ముందుకు వచ్చిన ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీక్లబ్, రోటరీ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఐసొలేషన్ కేంద్రానికి కావాల్సిన వసతులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది నియామకంపై కలెక్టర్ అనితారామచంద్రన్, డీఎంహెచ్వో సాంబశివరావుతో సంప్రదిస్తామని అన్నారు. అవసరమైతే ఔట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమిస్తామన్నారు. సామాన్య మానవుడికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయని తెలిసినా, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సీఎం కేసీఆర్ లాక్డౌన్ విధించారని చెప్పారు. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణలోకి వెళ్లాలన్నారు. గడప దాటకుండ ఇంట్లోనే ఉండి, లాక్డౌన్కు సహకరించాలని సూచించారు. కరోనా రాగానే ఏదో అయిపోతుందని, బతకడం కష్టమని కొంత మంది భయంతో బాధపడుతున్నారన్నారు. అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కరోనా బాధితులకు కొవిడ్ కిట్లను అందజేస్తుందన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుకుంటూ, ఇంటి చిట్కాలతో కరోనాను జయించవచ్చునని చెప్పారు. సాధ్యమైనంత వరకు హోం ఐసొలేషన్లో ఉండాలని, అత్యావసర పరిస్థితుల్లో మాత్రమే దవాఖానకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మందడి ఉపేందర్రెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి వంశీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, బూడిద సురేందర్, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీక్లబ్ ప్రతినిధి రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ షఫీయా అక్తర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సుప్రియ, టీఆర్ఎస్ నాయకులు
మిట్ట వెంకటయ్య, కాసావు శ్రీనివాస్, రేపాక స్వామి, షేక్ దావూద్, నరహరి పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
యాదగిరిగుట్ట పట్టణంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పరామర్శించారు. యాదగిరిపల్లికి చెందిన ఎండీ తాహేర్అలీఅక్తర్, దొమ్మాట యాదగిరిరెడ్డి, భారతమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా మంగళవారం వారి కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.