యాదాద్రి భువనగిరి, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఇతర చిరు ఉద్యోగుల్లో వేతన సంబురం నెలకొన్నది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం ఫిట్మెంట్తో తీపి కబురును అందించింది. పెంచిన వేతనాల అమలు కోసం ఇప్పటికే ఆర్థికశాఖ ఆయా శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆయా వర్గాలు వేతనాల కోసం ధర్నాలు, నిరసనలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుని ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారు. వేతన పెంపుపై అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు గౌరవ వేతనం అందుకుంటున్న చిరుద్యోగులందరికీ వేతనాలు పెంచారు. ఫలితంగా జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ అసిస్టెంట్లు, హోంగార్డులు, వీఆర్ఏ, వీఏవో, సెర్ప్ ఉద్యోగులు, ఆశ వర్కర్లకు 30 శాతం మేర గౌరవ వేతనాలను ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన పదివేల మందికి పైగా ఉద్యోగులకు పెరిగిన వేతనం అందనున్నది.
ప్రజాప్రతినిధులకు మరింత గౌరవం..
జిల్లాలోని ప్రజాప్రతినిధులకు ఇప్పటివరకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని చిరు ఉద్యోగులతో సమానంగా 30 శాతానికి పెంచడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఖుషీ అవుతున్నారు. జిల్లాలో 421 వరకు గ్రామపంచాయతీలు ఉండగా, 420 మంది సర్పంచులు కొలువుదీరి ఉన్నారు. అలాగే 177 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 మంది ఎంపీపీలుగా, మరో 17 మంది జడ్పీటీసీలుగా కొనసాగుతుండగా, 160 మంది ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరందరికీ పెరిగిన వేతనాలతో మరింత గౌరవం పెరగనున్నది. సర్పంచ్లు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.6,500లకు, ఎంపీపీ, జడ్పీటీసీలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10వేల వేతనం రూ.13వేలకు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో వేతనాల పెంపు కోసం ప్రజాప్రతినిధులు ఎన్నో ఆందోళనలు నిర్వహించినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల వేతన పెంపుపై నిర్ణయం తీసుకుని అమలు చేశారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
బీబీనగర్, జూన్ 17 : తెలంగాణ ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచు తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేయడం హర్శించదగిన విషయమన్నారు.
వేతనం పెంచడం హర్షణీయం
అడ్డగూడూరు, జూన్ 17 : ప్రభుత్వ ఉద్యోగులతోపా టు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం 30 శాతం పెంచడం హర్షణీయం. ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారంపై సీఎంకు ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. నిత్యం గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
గుండాల, జూన్ 17: ప్రభుత్వం మా శ్రమను గుర్తించి మాకు 30 శాతం వేతనాలను పెంచడం సంతోషకరం. గత ప్రభుత్వాల హయాంలో అరకొర జీతాలతో ఇబ్బందులు పడేవాళ్లం. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల జీతాన్ని రూ.7,800లకు పెంచడం హర్షించదగ్గ విషయం. కరోనా సమయంలో ప్రజలకు మేము చేసిన సేవలు, శ్రమకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఈ విధంగా మాకు జీతాలను పెంచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.