భువనగిరి అర్బన్, మే 17 : పల్లెల్లో ఎలాంటి పనులు అభివృద్ధికి నోచుకోక గతంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయేది. ఈ క్రమంలో పల్లెలను పట్టణాలుగా మార్చాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రా మాల రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల్లో ప్రజల వసతులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని ప్రణాళికా పద్ధతితో పూర్తి చేస్తున్నది. పల్లెల్లో అన్ని హంగులతో వైకుంఠధామం నిర్మాణం, పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలను బతింకించడంతో పచ్చదనం విలాసిల్లుతుంది. పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్టును అతి సుందరంగా తీర్చిదిద్దారు. గ్రామంలో పారిశుధ్య పనులను రోజు చేపడుతుండటంతో స్వచ్ఛతను సంతరించుకున్నది. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న మండలంలోని తుక్కాపురం గ్రామంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
మారిన గ్రామం…
మండల కేంద్రానికి కూతవేటు దూరంలో తుక్కాపురం గ్రామం పంచాయతీ ఉంటుంది. దీని పరిధిలో కాపుగూడెం, మర్రిగూడెం అనే రెండు గూడాలు కూడా ఉన్నాయి. గత జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 2000, కాగా 1600 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో గ్రామస్థులు శ్మశానవాటిక లేక ఇబ్బందులు పడేవారు. ట్రాక్టర్ లేకపోవడంతో పారిశుధ్య పనుల నిర్వహణ సక్రమంగా జరిగేది కాదు. సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడంతో పాలకవర్గం ప్రభుత్వ లక్ష్యాలు చేరుకున్నది. గడిచిన రెండేండ్లలో గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు రూ.30లక్షలు, హెచ్ఎండీఏ నిధులు రూ.60లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరిగాయి. గ్రామం సమీపంలో అర ఎకరం విస్తీర్ణంలో ఉన్న భూమిని చదును చేయించి అన్ని హంగులతో వైకుంఠధామం నిర్మించారు. మరో ఎకరం 16 గుంటల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి 3000 వేల మొక్కలు నాటారు.
మరో ఎకరం స్థలాన్ని కేటాయించి కంపోస్టుయార్డును ఏర్పాటు చేశారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణలోనూ గ్రామం ముందంజలో ఉన్నది. గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న పాత విద్యుత్ స్తంభాలు తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయించారు. పాత లైట్లు తొలగించి కొత్తవి బిగించారు. వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా సిమెంటు పైపులు, డ్రైనేజీ వేయించారు. అంతర్గత వీధుల్లో గ్రావెల్ వేసి, కంప చెట్లు తొలగించారు. రూ.10లక్షలతో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను, కంపోస్టు యార్డును రూ.2.20లక్షలతో, వైకుంఠధామం రూ.10 లక్షలతో నిర్మాణించారు. పంచాయతీ ట్రాక్టర్తో నిత్యం చెత్త తొలగించడంతో పారిశుధ్యం మెరుగుపడింది. వీధులన్నీ పరిశుభ్రంగా మారాయి. ప్రభుత్వం నెలనెలా విడుదల చేసే గ్రాంట్ను పంచాయతీ కార్మికుల జీతభత్యాలు, ఇతర పనులకు వినియోగిస్తున్నారు. గ్రామంలో మిషన్భగీరథ నీరు గ్రామస్థులకు సరిపడా అందుతున్నది. వేసవి కాలంలో గతంలో మంచినీటి కొరత ఉండేది. ప్రస్తుతం అందరికీ సరిపడా శుద్ధజలం అందుతున్నది. తాగునీటికి ఎలాంటి కొరతలేదు.