యాదాద్రి భువనగిరి, జూన్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తున్నది. ప్రతి ఏటా రెండు సీజన్లలో అందిస్తున్న సాయం కొండంత అండగా ఉంటూ ఆదుకుంటున్న ది. సీజన్ ప్రారంభంలో పెట్టుబడుల కోసం ఎదురు చూసే పనిలేకుండా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. 2018 వానకాలం నుంచి రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా.. సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయం పండుగలా సాగుతున్నది. అప్పులు చేయనిదే పంటలు సాగు చేసే పరిస్థితుల నుంచి గట్టెక్కి రైతులే అప్పులిచ్చే స్థితికి నేడు ఎదిగారు. స్వరాష్ట్ర ఫలాలు అందరికంటే ఎక్కువగా అన్నదాతలకు అందించేందుకు చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ రైతుబంధు వంటి అనేక పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో.. గత ఏడేండ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమిది.
పడావు పడిన భూములు సాగులోకి..
జిల్లాలో కరువుకు మారుపేరుగా నిలిచిన పల్లెలు నేడు పాడి పంటలతో కళకళలాడుతున్నాయి. మూసీ పరవళ్లకు తోడు.. గోదావరి జలాలు కూడా నేలపై పారుతుండటంతో పడావు పడ్డ భూములు సైతం సాగులోకి వచ్చాయి. 2017-18 వానకాలంలో జిల్లాలో 3.44 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతుండగా.. 2020-21 వానకాలం నాటికి సాగు విస్తీర్ణం 4.38 లక్షల ఎకరాలకు పెరిగింది. అలాగే 2017-18 యాసంగిలో కేవలం 1.20 లక్షల్లోనే ఉన్న పంటల సాగు ఏకంగా 2020-21 యాసంగి నాటికి 2.40 లక్షల ఎకరాలకు పెరిగింది. పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీరు.. ఉచిత విద్యుత్ వంటి పరిస్థితుల నేపథ్యంలో వలసవెళ్లిన ఎన్నో కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాయి. సకాలం లో పెట్టుబడి సాయం అందించడంతోపాటు విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం వంటి చర్యల ఫలితంగా ఒకప్పుడు ఎకరం సేద్యం చేసిన రైతులు నేడు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.
తీరిన అప్పుల పాట్లు
ఎన్నో ఆశలతో సాగుకు ఉపక్రమించే రైతులకు ప్రతి సీజన్లోనూ పెట్టుబడి పెద్ద సమస్యగా ఉంటున్నది. అప్పులు చేసి పంటలు సాగు చేసినప్పటికీ పెట్టిన పెట్టుబడులు సైతం వెళ్లక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గతంలో కోకొల్లలు. అయితే రైతులు అప్పులు లేకుండా ప్రశాంతంగా పంటలు సాగు చేసేలా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి సీజన్లోనూ పెట్టుబడి సాయం అందిస్తున్నారు. సంక్షోభ సమయంలోనూ రైతుకు అండగా నిలిచి గత రెండేండ్లుగా నిరాటంకంగా సాయం అందిస్తూ వస్తున్నారు. గత మూడేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సాయంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ పంటలను పండించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో బ్యాంకులు సైతం ఇతోధికంగా రుణాలను అందిస్తున్నాయి. గత ఏడాది వానకాలంలో జిల్లాలో 797.44 కోట్లను రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకుని రూ.808.20 కోట్ల రుణాలను అంటే 101 శాతం మేర రుణాలను రైతులకు అందించాయి. పంటల సాగు విస్తీర్ణం పెరగడం.. దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే కాకుండా.. సకాలంలో చెల్లింపులు జరిపి ప్రతి ఏటా మనోధైర్యంతో పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు.