భువనగిరి అర్బన్, జూన్ 16 : అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించి బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. జిల్లాలో చాలా మంది అధికారులు జిల్లా కేంద్రంలో ఉండకుండా హైదరాబాద్ నుంచి రాకపోకలు కొనసాగిస్తూ విధులకు హాజరుకావడం సరికాదన్నారు. సకాలంలో అధికారులు కార్యాలయాలకు హాజరుకాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున జిల్లాలో వాగులు, కాల్వలతో పాటు డ్రైనేజీలు పొంగిపొర్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, ఇతర సమాచారం కోరిన వెంటనే కలెక్టరేట్కు రావాలని, స్థానికంగా ఉండకపోవడంతో పలు అభివృద్ధి పనులకు అంతరాయం కలుగుతుందన్నారు. జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజినల్ అధికారులు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు విధిగా పనిచేసే ప్రదేశంలో ఉండాలని,తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరూ జిల్లా కేంద్రం వదిలి వెళ్లరాదని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ను కలిసిన ఏఎంసీ చైర్మన్ రమేశ్గౌడ్
కలెక్టర్ పమేలాసత్పతిని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్ కలెక్టరేట్లో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమెకు పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, వైస్ చైర్మన్ అల్వా మోహన్రెడ్డి, డైరెక్టర్లు కేశవరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి అజింత్రావు, జూనియర్ అసిస్టెంట్ సాయికిశోర్, అయూబ్ ఉన్నారు.