యాదాద్రి, మే14: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయం, అనుబంధ ఆలయాలైన శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, దుబ్బగుంటపల్లి శ్రీయోగానంద నరసింహస్వామి ఆలయంలో ఈ ఏడాది వైశాఖశుద్ధ ద్వాదశి 23వ తేదీ నుంచి చతుర్ధశి 25వ తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. గీత తెలిపారు. శుక్రవారం యాదాద్రి కార్యనిర్వహక కార్యాలయంలో ఆలయ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. కొవిడ్ కారణంగా చేపట్టాల్సిన జాగ్రత్తలు సూచించారు. సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉత్సవాలను ఆంతరంగికంగా జరుపనున్నట్లు ఆమె తెలిపారు.
జయంతి ఉత్సవాల వివరాలు(స్వామివారి బాలాలయంలో)..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో ఈ నెల 23వ తేదీన ఉదయం 9.30 గంటలకు జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పూణ్యాహవాచనం, లక్ష పుష్పార్చన, తిరు వెంకటపతి అలంకార సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణ, రుత్విక్వరణం నిర్వహిస్తారు.
24వ తేదీన..
ఉదయం అభిషేకం, నవకలశస్నపనం, లక్ష కుంకుమార్చన, కాళీయమర్ధన అలంకారసేవ, సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమత్ర హవనం, హనుమంత వాహనంపై శ్రీ రామ అవతారం అలంకారసేవ నిర్వహిస్తారు.
25వ తేదీన..
ఉదయం 7 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాయంలో పూర్ణాహుతి, శతఘటాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాదగోష్టి నిర్వహించనున్నారు.
పాతగుట్ట దేవాలయంలో ..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 23న ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేనపూజ, పూణ్యాహవాచనం, లక్ష పుష్పార్చన, సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, రుత్విక్వరణం నిర్వహిస్తారు.
24వ తేదీన..
ఉదయం అభిషేకం, నవకలశస్నపనం, లక్ష కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం నిర్వహించనున్నారు.