భువనగిరి అర్బన్, మే 14: తెలంగాణ ప్రభుత్వం కరోనా కాలంలో ప్రైవేట్పాఠశాలల టీచర్లు, సిబ్బందిని ఆదుకోవడానికి మొదటి విడుతలో సాయాన్ని అందజేసింది.ఇప్పుడు రెండో విడుతలో సాయాన్ని అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొదటి విడుతలో అందుకున్న వారితో పాటు ఈ సారి అదనంగా మరికొంత మందికి సాయాన్ని అందజేసేందుకు కసరత్తు చేసింది. మానవీయ కోణం లో వీరందరినీ ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం ప్రైవేట్పాఠశాలలు 156 ఉండగా అందులో 4 పాఠశాలలు పర్మిషన్ గడువు పూర్తయింది. దీంతో 152 పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్లు మొదటి విడుతలో సాయాన్ని పొం దిన వారు 1600 మంది, సిబ్బంది 172 మందిఉన్నారు.మొదటి విడుతలో (యూ-డైస్) యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్రకారం జిల్లాలో మొదటి విడుతలో 1772 మందికి సాయం అందజేసింది. టీచర్ల ఖాతాల్లో రూ.2వేల చొప్పు న జమ చేసింది. అంతే కాకుండా ఒక్కొక్క టీచర్కు 25 కేజీల చొప్పున రేషన్ దుకాణల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేసింది.
రెండో విడుతలో సాయం…
మొదటి విడుతలో సాయం అందని ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రెండో విడుతలో అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి ప్రైవేట్ టీచర్, సిబ్బందికి సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యూ-డైస్లోనమోదు కాని 707 ప్రైవేట్ టీచర్లు, 555 సిబ్బందికి కూడా రెండో విడుతలో సాయం అందించేందుకు మానవీయ కోణంలో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రెండో విడుతలో అదనంగా 1262 మందికి సాయం అందించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించింది. దీంతో మొత్తంగా జిల్లాలో ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది 3034 మందికి నగదు రూ.6,068,000, 25 కేజీల బియ్యం చొప్పున 75, 850 కేజీల బియ్యం అందించనున్నది. పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు ఈ సాయం ప్రభుత్వం అందించనున్నది. ఈ నెల 15వ తేదీలోగా సాయం అందించేలా సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో ఏర్పాట్లపై అధికారులు సన్నద్ధమయ్యారు.
పూర్తి నివేదికను అందజేశాం
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందజేస్తున్న సాయాన్ని ఇవ్వటానికి జిల్లాలో తయారు చేసిన పూర్తి నివేదికను విద్యాశాఖకు అందజేశాం. మొదటి విడుతలో 1772 మందికి సాయం అందజేయగా, ఆన్లైన్లో వివరాలు తెలుపని వారు రెండో విడుతలో అదనంగా మరో 1262 మందికి అందజేసేందుకు ప్రణాళికను తయారు చేసి అందజేశాం. త్వరలో రెండో విడుత సాయాన్ని వారి వారి ఖాతాల్లో రూ.2వేల చొప్పున నగదును జమచేయనున్నది. అదే విధంగా రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యాన్ని అందజేయనున్నారు.
-చైతన్యజైనీ, డీఈవో ,యాదాద్రి భువనగిరి