అడ్డగూడూరు, మే 13 : మండలంలోని ధర్మారం గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేయడంతో నేడు గ్రామం అందంగా కళకళలాడుతున్నది.
గ్రామ జనాభా…
మండలంలో చిన్న గ్రామమైన ధర్మారం గ్రామాన్ని మొత్తం 8 వార్డులుగా విభజించారు. గ్రామంలో 1,235 మంది జనాభా, ఓటర్లు 1,072 మంది ఓటర్లు ఉంటారు. అందులో మహిళలు 544, పురుషులు 528 మంది ఉన్నారు. మొత్తం ఇండ్లు 345, రేషన్ కార్డులు 360 ఉన్నాయి. ఇంత వరకు గ్రామంలో ఎలాంటి కేసులు లేవు. ఏ గొడవలు జరిగినా పోలీస్స్టేషన్కు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కరించుకుంటామని గ్రామస్థులు చెబుతున్నారు.
మురుగుకాల్వలు శుభ్రం..
గ్రామంలో మురుగు కాల్వలను పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారు. దీంతో గ్రామంలో వీధులన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది మురుగుకాల్వల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ను చల్లుతారు. దోమల ద్వారా వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది మందును పిచికారీ చేస్తున్నారు.
రూ.12.50 లక్షలతో వైకుంఠధామం..
గ్రామంలో సుమారు 12.50లక్షలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు తుది దశకు వచ్చాయి. ఈ నెల చివరి కల్లా పనులు పూర్తి చేస్తామని సర్పంచ్ జ్యోతి తెలిపారు. రూ.2.50 లక్షలతో కంపోస్ట్షెడ్ను నిర్మించారు. సాయంత్రం కాగానే ఎల్ఈడీ లైట్ల వెలుగుతో జిగేల్మంటుంది. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సహకారంతో గ్రామంలో మునుపెన్నుడూ చూడని అభివృద్ధిని చూస్తున్నామని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో అభివృద్ధి..
గ్రామంలో ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్తో వారానికి మూడుసార్లు ఇంటింటికి చెత్తను సేకరిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించారు. గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ.4లక్షలతో గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచారు. గ్రామంలో దాదాపు అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. గ్రామంలో పాతబావులు, పాత ఇండ్లను పూడ్చడంతోపాటు గ్రామంలో పిచ్చి మొక్కలను తొలగించారు. గ్రామంలో ప్రతి వీధిలో మొక్కలు నాటడంతోపాటు ప్రతి ఇంటికి 6 మొక్కలను పంపిణీ చేశారు. 100 శాతం ఇంటి పన్నులను వసూలు చేశారు. 20వేల సామర్థ్యం గల మిషన్భగీరథ వాటర్ ట్యాంక్ను నిర్మించారు.
అందంగా పల్లె ప్రకృతి వనం..
గ్రామంలోని ప్రజలకు, బాటసారులకు పచ్చని ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు ఎకరం ప్రభుత్వ భూమి లో 2వేల మొక్కలు నాటారు. ఇప్పటికే మొక్కలు ఏపుగా పెరగడంతో పచ్చని వాతావరణం నెలకొన్నది. ప్రకృతి వనం చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన నర్సరీలో 12వేల మొక్కలను పెంచుతున్నారు.
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం…
గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులు, సీఎం కేసీఆర్ గ్రామాల పురోగతికి అమలు చేస్తున్న కార్యక్రమాలు మా లక్ష్యానికి చేయూతనిస్తున్నాయి. గ్రామాన్ని భవిష్యత్లో మరింత అభివృద్ధి చేసేందుకు పనిచేస్తా. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
– శీలం జ్యోతి, సర్పంచ్, ధర్మారం