చౌటుప్పల్ జూలై 12 : అతను ప్రముఖ :గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఏకలవ్య శిష్యుడు. అతను గాత్రం వినిపిస్తే అందరూ మంత్రముగ్ధులు కావాల్సిందే.13వ ఏట నుంచే పాటలు పాడటం మొదలు పెట్టి ప్రముఖ సింగర్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. క్లాసికల్, జానపదం, సెమీ క్లాసికల్తో పాటు ఏపాటనైనా పాడటం ఆయనకు పరిపాటి. తెలుగు, హిందీ పాటలు సులువుగా పాడటంలో దిట్ట. వందలాది షోలు చేసి ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, జానకమ్మ, మణు నుంచి అభినందలు అందుకున్నాడు చౌటుప్పల్ పట్టణానికి చెందిన మహ్మద్ రఫీరాజ్. ఒకవైపు పాటలు పాడుతూనే యాంకరింగ్, షార్ట్ఫిలిమ్స్, నటన రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అందరూ అతడిని జూనియర్ బాలుగా పిలుచుకుంటున్నారు.
బాలు నుంచి ప్రశంసలు..
1995లో చౌటుప్పల్లో ఎల్ఐసీ బ్రాంచీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి వచ్చిన బాలుని కలుసుకున్నాడు రఫీరాజ్. ఆయన ముందు ఓ పాటపాడి ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో బాలు అతన్ని సన్మానించాడు. అంతేకాకుండా హైదరాబాద్లో నిర్వహించిన ఓ స్టేజీ షోలో ఆయన గాత్రాన్ని విన్న ప్రముఖ సింగర్స్ జానకమ్మ, మనో ఆయన్ను ప్రశంసించారు. ఇవే కాకుండా హైదరాబాద్లో 2000లో నిర్వహించిన ఘంటసాల పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి పొందాడు. ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం అవార్డులు అందుకున్నాడు.
సినిమాలకు పాటలు పాడాలని ఉంది
మూడు దశాబ్దాలుగా సంగీత రంగంలో రాణిస్తున్నా. అప్పటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సినీరంగంలో రాణించాలనుకున్న కలను వాయిదా వేసుకున్నా. వేలాది స్టేజీ షోలు చేశా. ఉద్దండ సింగర్స్ నుంచి ప్రశంసలు పొందడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఎక్కడికి వెళ్లినా ఎంతోమంది గుర్తుపడుతారు. ప్రస్తుతం సినీరంగంవైపు దృష్ట్రి సారిస్తున్నా. అప్పట్లో సీఎం కేసీఆర్సారు చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఎన్నో తెలంగాణ పాటలు పాడా. చౌటుప్పల్లో వందలాది తెలంగాణ పాటలు ఆలపించా.
-రఫీరాజ్, సింగర్, చౌటుప్పల్
తెలంగాణ ఉద్యమంలో..
తెలంగాణ మళి దశ ఉద్యమంలో రఫీరాజ్ పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమ వేదికగా నిల్చి చౌటుప్పల్లో ఆరు నెలల పాటు తన సౌండ్ సిస్టమ్ను ఉచితంగా ఏర్పాటు చేశాడు. తన పాటలతో యువతను ఉర్రూతలూగించాడు. వందలాది తెలంగాణ ఉద్యమ పాటలు పాడాడు.
నటన, యాంకర్గా రాణింపు..
తన సరళమైన గాత్రంతో యూట్యూబ్ చానెల్లో వందలాది మందికి డబ్బింగ్ చెప్పాడు. ఇప్పటికే టిక్టాక్ ఫేమ్ సాయి దివ్య, గుంటి నాగరాజులను యాంకరింగ్ చేశాడు. తానే సొంతంగా రాయల్ ఈవెంట్స్ పేరుతో యూట్యూబ్ చానల్ను నిర్వహిస్తున్నాడు. తానే స్వయంగా నటించిన స్వార్థం, త్రివర్ణ షార్ట్ ఫిలిమ్స్కు మంచి పేరొచ్చింది.
బాలుకు ఏకలవ్య శిష్యుడు..
ఆరోతరగతి చదువుతున్నప్పుడు టీవీలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాట విన్నాడు. తాను ఆయనలాగే పాటలు పాడాలని కలలు కన్నాడు. కానీ తండ్రి ఎలక్ట్రీషియన్ సంపాదనతో కుటుంబం మొత్తం నెట్టుకు రావాల్సిన నేపథ్యంలో అప్పట్లో హైదరాబాద్కు వెళ్లి సంగీతం నేర్చుకోవడం కుదరలేదు. దీంతో ఆయన పాటలను టేప్ రికార్డుల్లో వింటూ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. అచ్చం బాలులాగానే పాట పాడటం నేర్చుకున్నాడు. ఆరో తరగతి చదువుతున్న సమయంలో (1990) మొదటి పాట చౌటుప్పల్లోని ఓ స్టేజీపై పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఒకవైపు పాటలు పాడుతూనే టెన్త్, ఐటీఐ పూర్తిచేశాడు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్టేజీ షోలు చేస్తూ పాటలు పాడుతూ సింగర్గా రాణిస్తున్నాడు.