యాదాద్రి భువనగిరి, జూలై 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హరితహారంలో మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలో పచ్చద నం నాలుగు శాతం పెరిగిందని, వచ్చే రెండు, మూడేండ్లలో అడవుల విస్తీర్ణాన్ని మూడు శాతానికి పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. భువనగిరి పట్టణంలో రూ.30 లక్షలతో నిర్మించిన అటవీ క్షేత్రాధికా రి నివాస భవనాన్ని ప్రారంభించిన మంత్రులు రాయగిరి వద్ద అటవీశాఖ అభివృద్ధి చేసిన ఆంజనేయ అరణ్యం(రాయగిరి-1) అర్బన్ పార్కును సందర్శించి మొక్కలు నాటారు. అనంతరం గత హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ అడవుల సంరక్షణలో భాగంగా రాయగిరి అర్బన్పార్కులో నాటిన 30 వేల మొక్కలు పెరిగి నేడు మహావృక్షాలుగా మారాయన్నారు. హరితహారంతో రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం సంతరించుకుందని, ప్రభుత్వం గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యమివ్వడంతో రాబోవు రోజుల్లో అడవుల విస్తీర్ణం 33 శాతానికి పెరగనుందన్నారు. పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
ఇబ్రహీంపురాన్ని సందర్శించిన మంత్రులు ..
దామరచర్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం వీర్లపాలెం, దిలావర్పూర్ గ్రామాలకు చెందిన అటవీ భూములను ప్రభుత్వం సేకరించి టీఎస్ జెన్కోకు అప్పగించింది. అందుకు బదులుగా తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపురం గ్రామంలోని సర్వే నం.120లోగల 121 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిహారం కింద తిరిగి తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖకు కేటాయించింది. ఈ నేపథ్యంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఇబ్రహీంపురం గ్రామ పరిధిలోని అటవీ భూములను సోమవారం సందర్శించారు. సీఏ బ్లాక్ను ప్రారంభించిన అనంతరం మం త్రులు మొక్కలు నాటారు. ఈ ప్రాంతాన్ని అటవీ భూములుగా అభివృద్ధిపర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంత్రుల వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఆర్.శోభ, ప్రిన్సిపల్ సీసీఎఫ్ లోకేశ్జైశ్వాల్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎంజె అక్బర్, డీఎఫ్వో వెంకటేశ్వర్రెడ్డి, ఆర్డీవో భూపాల్రెడ్డి, ఎఫ్ఆర్వోలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
అడవుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలం ఇబ్రహీంపురం సమీపంలోని అటవీ బ్లాక్కు ఏర్పాటు చేసిన ప్రవేశ గేట్ను సోమవారం ఆయన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. చుట్టూ కంచె ఏర్పాటు చేసి అందులోని చెట్లను పరిరక్షించాలని అటవీశాఖ అధికారులకు ఆయన సూచించారు. అనంతరం మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్వో పాహిన్, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ జ్యోతి, జడ్పీ వైస్ చైర్మన్ బిక్కూనాయక్, ఎంపీపీ సుశీలారవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ కరుణాకర్, కో-ఆప్షన్ సభ్యుడు రహమత్షరీఫ్, టీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూనాయక్ పాల్గొన్నారు.