కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో స్వీయ నియంత్రణే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చినా మిగతా వారికీ వైరస్ అంటుకునే అవకాశాలు ఉన్నందున వారికి దూరంగా ఉండటంతో పాటు మాస్కు, శానిటైజర్ తప్పకుండా ఉపయోగించాలని సూచిస్తున్నారు. చాలా మంది రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు విటమిన్-సీ, డీ-3, జింక్ తదితర మాత్రలు వాడుతున్నారు. నెల రోజుల పాటు వాడాలంటే సుమారు ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో వంటింట్లో ఉండే సరుకులతో పాటు పౌష్టికాహారంతో రోగ నిరోధకశక్తి పెంపొందించుకోవచ్చని, సరైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి…
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు కూరగాయలు ఉడకబెట్టుకొని తినాలి. బయటి ఆహారం తీసుకోవద్దు. రోజుకు 2నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. ఉప్పు, చెక్కర తక్కువ మోతాదులో తీసుకోవాలి. స్వీట్లు, నూనె పదార్థాలు, స్నాక్స్కు దూరంగా ఉండాలి. డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉండే విధంగా చూడాలి.