ఆలేరు టౌన్, జూన్ 11 : పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల రోజురోజకూ పరిపాటైంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ. 99.78కు చేరుకుంది. లీటర్ డీజిల్కు రూ. 94.71 అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా నేపథ్యంలో జనం ఆర్థికంగా కుదేలవుతున్నారు. లాక్డౌన్తో పనులు లేక అల్లాడుతున్నారు. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు వెక్కిరిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యుడు సతమతవుతున్నాడు. బండి తీయాలంటే బయపడుతున్నాడు. కరోనా కష్టకాలంలో కేంద్రం చమురు ధరలు పెంచి సామాన్యుడితో ఆటలు ఆడుకుంటుంది. ధరలు తగ్గించేది పోయి.. ఇలాంటి విషమ పరిస్థితుల్లోనూ కేంద్రం దొంగదెబ్బ కొడుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవితం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. జిల్లాలో 90 పెట్రోల్, డీజిల్ బంక్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు రోజువారీగా నిర్ణయిస్తున్నాయి.
ముందు రోజు అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత డీలర్లకు మరుసటి రోజు ధరలు చేరుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ధరలు పెంచుకుంటూ పోతున్నారు. రోజురోజుకూ పెంపు పైసల్లో ఉంటుంది. పైసలు కాస్త రూపాయల్లోకి చేరుతుంది. గత మేలో ధరలు 8సార్లు పెరిగాయి. చమురు వినియోగం అనేది మనిషి జీవనంలో ఒక భాగమైంది. డీజిల్ ధరలు పెరిగిన ప్రతీసారి రవాణా వ్యయం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఎటొచ్చి సామాన్యుడికే మళ్లీ ఇబ్బంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో చమురు ధరలు తటస్థంగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో కేంద్రం నిత్యం కొరడా ఝులిపిస్తుంది. దీంతో ధరల పెంపుపై ప్రజలు కేంద్రంపై మండిపడుతున్నారు. అంతే కాకండా ఇంధన పెరుగుదల వ్యవసాయంపై పడుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధరల పెంపు సరికాదు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సరికాదు. సామాన్య ప్రజలపై ధరల పెంపు తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. బండి బయటకు తీయాలంటే భయమేస్తుంది. వాహనాలు నడిపించలేని పరిస్థితులు కనబడుతున్నాయి. కరోనా కాలంలో సరైన ఉపాధి లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు.
-వుల్లోజు సత్యం, ఆలేరు
సైకిలే గతి
కేంద్ర ప్రభుత్వం వరుసబెట్టి చమురు ధరలను పెంచుకుంటూ పోతోంది. ఇక నుంచి బండ్లు పక్కనబెట్టి సైకిల్పై తిరగడం మినహా మరోమార్గం కనిపించడం లేదు. మేలో 8 సార్లు పెట్రోల్ ధరలు పెంచారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. సామాన్యుడి బాధలు కేంద్రానికి పట్టడం లేదు.
-జూకంటి ఉప్పలయ్య, రైతు, ఆలేరు