చౌటుప్పల్ , జూలై 11: నేరాల నియంత్రణకు చౌటుప్పల్ పోలీసులు వినూత్న పంథాను అవలంబిస్తున్నారు. దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు , ఒకవేళ జరిగినా వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకునేందుకు మూడో నేత్రాలైన సీసీ కెమెరాలను చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలంలో విరివిగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండటం.. మెరుగ్గా రవాణా సౌకర్యం కలిగి ఉండడంతో కొంతమంది కేటుగాళ్లచూపు చౌటుప్పల్పై పడేది. ఎంచక్కా ఇక్కడికి రావడం చోరీలు చేయడం ..దర్జాగా తప్పించుకోవడం పరిపాటిగా మారింది. ప్రధానంగా తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడేవారు. ఇదిలా ఉంటే చౌటుప్పల్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగిన వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేవారు. బాధితులు వచ్చి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా దొంగలు, ప్రమాదాల కారకులను పట్టుకోవడం ఇబ్బందిగా మారేది. దీనికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు చౌటుప్పల్ పోలీసులు సుమారు రూ. రూ.80లక్షలతో 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
600 సీసీ కెమెరాల ఏర్పాటు
చౌటుప్పల్ మున్సిపాలిటీ , మండలం వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమల నిర్వాహకులు, దాతలు చేస్తున్న ఆర్థిక సాయంతో వీటిని ఏర్పాటు చేశారు. రూ. 80లక్షలతో 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా 250, మండలం వ్యాప్తంగా మరో 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా జాతీయ రహదారుల పక్కన, పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్న కాలనీల్లో, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణతో పాటు ప్రమాదాల కారకులను సులువుగా గుర్తించేందుకు వీలుకలుగుతుంది.
పోలీసులకు మూడో నేత్రంగా సీసీ కెమెరాలు
నేరాలను పెద్ద ఎత్తున నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలంలో సుమారు 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇవి పోలీసులకు మూడో నేత్రంగా పనిచేస్తున్నాయి. దొంగతనాలకు పాల్పడుతున్న వారితో పాటు జాతీయ రహదారిపై ప్రమాదాలకు కారణమవుతున్న వారిని సులువుగా గుర్తించేందుకు వీలు కలుగుతున్నది.
-ఎన్.శ్రీనివాస్, సీఐ, చౌటుప్పల్