యాదగిరిగుట్ట రూరల్, జూలై11: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని గంటల కొద్దీ క్యూ కట్టా రు. స్వామివారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము నుంచే మొదలైంది. నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు.
సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యతిరుకల్యాణమహోత్సవంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ కల్యాణ తంతును జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖమండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకను భక్తులు వీక్షించి తరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడుసేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి భక్తులు రుద్రాభిషేకం జరిపారు. యాదాద్రిస్వామి వారిని మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారి ఖజానాకు రూ.19,03,324 లక్షల ఆదాయం
స్వామి వారి ఖజానాకు రూ. 19,03,324 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుక్కిం గ్ ద్వారా రూ.2,88,024 లక్షలు, రూ.100 దర్శనంతో రూ. 26,500 వేలు, వీఐపీ దర్శనాలతో రూ. 2,32,500 లక్షలు, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 64వేలు, కల్యాణకట్ట ద్వారా రూ.37,400 వేలు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.8,32,040 లక్షలు, శాశ్వత పూజల ద్వారా రూ.50,580 లక్షలు, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,25,228 లక్షలు, యాదరుషి నిలయంతో రూ. 80 వేలు, టెంకాయల విక్రయం ద్వారా రూ. 90 వేల ఆదాయం సమకూరింది.