సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ఓ వైపు కరోనాను కట్టడి చేస్తూ.. మరోవైపు కరోనా బాధితులకు సేవలందించడంలో హైదరాబాద్ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. జీహెచ్ఎంసీ, వైద్యశాఖతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. మరోవైపు గాంధీ, కింగ్కోఠి, నిమ్స్లో ఆయా వైద్య విభాగాలతో కలిసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటగా గాంధీలో హెల్ప్లైన్ను ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ ఆ తర్వాత మిగిలిన అన్ని వైద్యశాలలకు విస్తరించింది. కరోనాతో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వారి బంధువులకు తెలియజేయడంలో ఈ సహాయ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాక ఈ కేంద్రాల ద్వారా ఆయా వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న రోగులు, పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల వివరాలు తెలుసుకోవడం సులభంగా మారింది. నగరవాసులకు కావాల్సిన సహాయం చేయడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సిబ్బందికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రజలు, వైద్య విభాగానికి వారధిగా..
ప్రజలు, వైద్య విభాగానికి మధ్య వారధిగా పోలీస్ హెల్ప్ డెస్క్లు పని చేస్తున్నాయి. అంతేకాక కొవిడ్ రోగులను రక్షిస్తున్న వైద్యులకు ప్రతి విషయంలో పోలీసులు అండగా నిలుస్తున్నారు. ప్రతి ప్రభుత్వ వైద్యశాలకు పోలీసు విభాగం నుంచి ఓ నోడల్ అధికారిని నియమించారు. ఆయా అధికారులు అక్కడి వైద్యులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సేవలందించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం గాంధీ దవాఖానలో ప్రారంభమైన హెల్ప్ డెస్క్కు ప్రతిరోజు 200కు పైగా కాల్స్ వస్తున్నాయి. అక్కడి వైద్యులతో సమన్వయం చేసుకుంటూ మూడు షిఫ్ట్ల్లో ఈ డెస్క్ను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం నుంచి ఖాళీ అవుతున్న పడకల సమాచారం.. చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వారి బంధువులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు రోగుల సమాచారం తెలుసుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. కింగ్కోఠిలోనూ ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ అనేక మందికి ఉపయోగపడుతున్నది. ఇక నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ప్రతిరోజు సుమారు ౩౦ మంది ఫోన్లు చేస్తున్నారు.
సమన్వయంతో సేవలు..
ప్రభుత్వ శాఖల సమన్వయంతో సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లు బెడ్ మేనేజ్మెంట్ సిస్టం, జీహెచ్ఎంసీ అంబులెన్స్ బుకింగ్ విధానం, ఆక్సిజన్ సరఫరా వివరాలు, కొవిడ్తో మరణించిన వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాయి. అంతేకాక కేవలం ప్రభుత్వ వైద్యశాలల సమాచారమే కాక ఇతర ప్రైవేట్ వైద్యశాలలకు సంబంధించిన వివరాలను ఫోన్ చేసిన వారికి అధికారులు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
అడిగిన వెంటనే సమాచారం: సీపీ అంజనీకుమార్
అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తున్నది. ప్రధాన వైద్యశాలల్లో ఇప్పటికే హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. మరిన్ని దవాఖానాల్లోనూ వీటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. లైజనింగ్ అధికారుల ద్వారా దవాఖానలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రజలకు తెలియజేస్తున్నాం. వైద్యాధికారులు, జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంటున్నాం. నగర పోలీసుల తరుపున వైద్యులు, వైద్య బృందానికి వందనం చేస్తున్నా. కొవిడ్పై కొందరు పుట్టిస్తున్న పుకార్లను నమ్మవద్దు. ఏ సమాచారం కావాలన్నా హెల్ప్డెస్క్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.