జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటుకు వడివడిగా అడుగులు
గత నెలలోనే రూ.70లక్షలకు మంజూరు కల్పించిన ప్రభుత్వం
గురువారం తెరుచుకున్న టెండర్లు
ఉచితంగా 57 వైద్య పరీక్షలు త్వరలోనే అందుబాటులోకి
యాదాద్రి భువనగిరి, జూన్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యా న్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నది. ప్రతీ చిన్నపాటి పరీక్షలకు హైదరాబాద్కు పరుగెత్తాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రాలనే వైద్యహబ్గా తీర్చిదిద్దేందుకు సిద్ధమైనది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జి ల్లా కేంద్రంలోనూ డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పా టు చేసేందుకు గత మే 10న మంజూరు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వైద్య పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పంచాయతీరా జ్ శాఖ ఆధ్వర్యంలో ఎస్టిమేట్లను రూపొందించగా రూ.70లక్షలకు ప్రభుత్వం మంజూరు సైతం ఇచ్చింది. వెనువెంటనే జిల్లా అధికారులు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టారు. గురువారం టెండర్లను తెరిచే ప్రక్రియ సైతం పూర్తయ్యింది. పనులను సైతం వెనువెంటనే మొదలు పెట్టనుండగా.. త్వరలోనే 57 వైద్య పరీక్షలు ఉచితంగానే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కరోనా సంబంధిత పరీక్షలు సైతం అందుబాటులోకి రా వడం.. బాధితులకు ఊరట కలిగించనుంది.
24 గంటలూ అందుబాటులో సేవలు..
జిల్లాలోని 17 మండలాల ప్రజానీకానికి జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానతోపాటు మూడు సీహెచ్సీలు, 21 పీహెచ్సీలలో వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ వంటి రుగ్మతలతో బాధపడుతుండగా.. గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సర్, థైరాయిడ్ తదిత ర జబ్బులకు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోక తప్పని పరిస్థితి. తాజాగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనేక రకాల పరీక్షలు చేయించుకోవా ల్సి వస్తున్నది. ఇది సామాన్య ప్రజానీకానికి పెను భారంగా మారింది. ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మొదలు..పూర్తి స్థాయి వై ద్యం పొందేందుకు ఆస్తులను సైతం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్ చరమగీతం పాడనున్నది. 24 గం టలూ ఈ సెంటర్ సేవలు అందుబాటులో ఉంటుండగా.. గంటల వ్యవధిలోనే 5 వేలకు పైగా పరీక్షలను చేయగల సామర్థ్ధ్యం గల యంత్రాలను ప్రభుత్వం సమకూర్చుతున్నది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చే శాంపిళ్లను డయాగ్నస్టిక్ సెంటర్లో పరీక్షించి ఆయా వైద్య కేంద్రాల ద్వారా అవసరమైన వైద్యాన్ని అందించనున్నారు. జిల్లా వైద్యాధికారితోపాటు నోడల్ అధికారి, ల్యాబ్ మేనేజర్, పదిమంది ల్యాబ్ అసిస్టెంట్లు, డాటా ఆపరేటర్ నిత్యం డయాగ్నస్టిక్ సెంటర్లో అందుబాటులో ఉంటారు.
త్వరలోనే డయాగ్నస్టిక్ సెంటర్ సేవలు ప్రారంభం
జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినది. ప్రస్తు తం టెండర్ల దశలో ఉండగా.. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతాం. త్వరితగతిన సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చి 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగానే జిల్లా ప్రజానీకానికి అందించేలా చూస్తాం.
అనితారామచంద్రన్, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
ఉచితంగా అందే వైద్య పరీక్షలు ఇవే..
పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు కానున్న డయాగ్నస్టిక్ సెంటర్లో కరోనా పరీక్షలతోపాటు బీపీ, షుగర్, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్, బొక్కల సంబంధిత జబ్బులకు సంబంధించి ఎక్స్రేను ఉచితంగా తీయడంతోపాటు.. బయోకెమిస్ట్రీ, పాథాలజీకి సంబంధించిన పలు పరీక్షలను ఉచితంగానే చేయనున్నారు. మొత్తం 57 పరీక్షలను ఉచితంగానే చేయనుండగా.. ఖరీదైన పరీక్షలను సైతం పూర్తి ఉచితంగా చేసి వెంటనే రిపోర్టు ఇవ్వనున్నారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగుల సెల్ఫోన్లకు మెసేజ్ల రూపంలోనూ పంపించనున్నారు. పెద్ద, పెద్ద కార్పొరేట్ దవాఖానల్లో.. నిమ్స్, ఉస్మానియా, గాం ధీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉండే అత్యాధునిక యంత్రాలన్నీ భువనగిరిలోని డయాగ్నస్టిక్ సెంటర్లో అందుబాటులో ఉండనున్నాయి.