యాదాద్రి భువనగిరి, జూలై 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :నిన్న మొన్నటి వరకు మూసీనది మినహా చెప్పుకోదగ్గ సాగునీటి వనరులు లేవు.. బీడు బారిన పొలాలు.. భూగర్భజలాలు అడుగంటి ఆగిఆగి పోసే పంపు సెట్లు.. తడారి, పొడిబారి, పొలమారిన ఆ భూముల్లో ఎర్రగా ఎండిపోయినట్టుండే పంటలు తప్పితే పచ్చదనమే కనబడేది కాదు. మరిప్పుడు ఆ దుస్థితి పోయింది. గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి. సీజన్ సీజన్కూ పెరుగుతున్న సాగు విస్తీర్ణం నేపథ్యంలో పంట చేలల్లో ధాన్యపు రాశులు పోటెత్తుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పంట పండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు టన్నుల కొద్దీ ధాన్యం రాశులు తరలిరాగా.. ప్రతీ సీజన్లోనూ కోట్ల రూపాయల ధాన్యం వ్యాపా రం జరుగుతున్నది. లక్షల రూపాయల పైకం రైతుల చేతికందుతున్నది. జిల్లాలో గడిచిన నాలుగేండ్లలో వ్యవసాయ రంగంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైన ది.
జిల్లాలో రైతాంగం చాలావరకు బోరు బావులను నమ్ముకొని సేద్యం చేస్తున్నది. మూసీనది పరీవాహక ప్రాంతాలైన భూదాన్పోచంపల్లి, వలిగొండ, సంస్థాన్నారాయణపురం మండలాల్లో కాస్తో కూస్తో ఉన్న సాగునీటి వనరులతో రైతులు వరి సాగు చేస్తూ వస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బోర్లు, బావుల కిం దనే వ్యవసాయం చేస్తున్నారు. వలసలకు మారుపేరుగా నిలిచే ఈ ప్రాంతంలో జీవకళను కోల్పోయిన చెరువులు మినహా చెప్పుకోదగ్గ సాగు నీటి వనరులు మచ్చుకైనా కన్పించవు. పరాయి పాలనలో ఛిద్రమై న ఈ ప్రాంత రైతుల బతుకు తీరు తెలంగాణ వచ్చా క మారిపోయింది. మిషన్ కాకతీయతో బావులు, బోర్లలో పెరిగిన భూగర్భ జలాలకు తోడు పెట్టుబడి సాయం, 24 గంటల కరెంటు ఈ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడ్డాయి. పుష్కలంగా మూసీ, గోదావరి నీళ్లు సాగుకు అందుబాటులోకి రావడంతో బీడుగా ఉంచిన భూముల్లోనూ నేడు పంటలు సాగవుతున్నాయి. ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా వరి పంటలే కనిపిస్తుండగా, భారీ స్థాయిలో ధాన్యం దిగుబడులు వస్తున్నాయి.
కరోనాలోనూ రైతులకు అండగా ప్రభుత్వం..
గత ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తూ వస్తున్నది. గతంలో జిల్లాలో కొద్దిపాటిగా ఏర్పాటు చేసిన కేంద్రాలకు కిలోమీటర్ల దూ రం నుంచి ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చి విక్రయించేవారు. లేదంటే కల్లాల వద్దనే దళారులకు అమ్ముకునేవారు. ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి పల్లెల్లోనే ధాన్యం కొనుగోళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం కొండంత ధైర్యాన్నిచ్చింది. ఈసారి యాసంగిలో జిల్లాలో పం డించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున 288 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా పరిస్థితుల్లో మద్దతు ధర కల్పించి ఇక్కడి రైతులకు ప్రభుత్వం అండగా నిలువగా.. ఊహకందని రీతిలో చేతికందుతున్న ధాన్యం కారణంగా గడిచిన మూడు, నాలుగేండ్ల కాలంలోనే ఈ ప్రాంత రైతుల బతుకు తీరులోనూ పెను మార్పులు వచ్చాయి.
ఏటా పెరుగుతూ వస్తున్న సాగు విస్తీర్ణం..
రైతులు ఇష్టంతో పంటలను సాగు చేస్తున్నారనడానికి గత నాలుగేండ్ల కాలంలో జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణమే నిదర్శనం. 2017-18 వానకాలంలో జిల్లాలో 3.44 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగవుతుండగా, 2020-21 వానకాలం నాటికి సాగు విస్తీర్ణం 4.38లక్షల ఎకరాలకు పెరిగింది. అలాగే 2017-18 యాసంగిలో కేవలం 1.20 లక్షల్లోనే ఉన్న పంటల సాగు ఏకంగా 2020-21 యాసంగి నాటికి 2.40లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రస్తుత వానకాలంలో 3,64,793 ఎకరాల్లో పంటలు సాగు కావొచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీరు.. ఉచిత విద్యుత్ వంటి పరిస్థితుల నేపథ్యంలో వలసవెళ్లిన ఎన్నో కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాయి. సకాలంలో పెట్టుబడి సాయం అందుతుండటంతోపాటు విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం వంటి చర్యల ఫలితంగా ఒకప్పుడు ఎకరంలోనే సేద్యం చేసిన రైతులు నేడు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.