చౌటుప్పల్ రూరల్, మే 9 : దేశమంతా కొవిడ్తో వణికిపోతున్నది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతినిత్యం కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అయినా చౌటుప్పల్ మండల పరిధిలోని ఎనగంటి, దుబ్బతండాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు లేకుండా ఔరా అనిపిస్తున్నారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కొవిడ్ రక్కసి ఇప్పటి వరకు దరిచేరలేదు. గిరిజనుల మంచి ఆహారపు అలవాట్లు కరోనా నుంచి కాపాడటం ఒకవైపు అయితే.. కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించడం మరోవైపు. కొంతమంది పనుల నిమిత్తం హైదరాబాద్కు ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తారు. అయినా కూడా నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు. సెకండ్వేవ్ కాదు మొదటి దశలో కూడా ఒక్క కొవిడ్ కేసు నమోదు కాలేదు.
ఆహ్లాదకరమైన వాతావరణం
చుట్టూ రాచకొండ గుట్టలు, పచ్చని చెట్లు ఉన్న ఈ తండాల్లో మొత్తం 150 కుటుంబాలు, 650 మంది జనాభా ఉన్నారు. ఈ రెండు తండాలను కలిపి ఎనగండి తండాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడుతారు. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ప్రతినిత్యం వ్యవసాయ పనులకు పొద్దుగాళ్ల వెళుతారు. వ్యవసాయం, మూగజీవాల పోషణ, మరికొందరు కూలీలు తదితర పనులు చేపడుతారు. మధ్యాహ్నం సమయంలో చెట్లకిందనే సేద తీరుతారు. తర్వాత పనులకు వెళ్తారు. తిరిగి ఇంటికి వస్తారు. రాత్రి సమయాల్లో కూడా ఇంటి బయట చెట్ల కిందనే నిద్రిస్తారు.
ఆహారపు అలవాట్లు…
రోజూ ఉదయం జొన్న గట్కాలో మజ్జిగను కలిపి లేదా జొన్నరొట్టెను తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం, సాయంత్రం మళ్లీ జొన్నరొట్టెను తీసుకుంటారు. వీటిలో ఆకుకూరలు, అడవుల్లో దొరికే చింతపూత, కొన్ని రకాల కాయలు వాడుతారు. నాటుకోడి కూరనే తింటారు. నడుకకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. గుట్టల ప్రాంతాల్లో దొరికే సీజనల్ పండ్లు తింటారు.
వారానికోసారి శానిటైజర్..
కరోనా కట్టడికి గ్రామపంచాయతీ వారానికోసారి శానిటైజర్ చేస్తున్నారు. గ్రామస్తులకు మాస్కులు, భౌతికదూరంపైగా అవగాహన కల్పించారు. దీంతో అందరూ నిబంధనలు పాటిస్తున్నారు. శుభ కార్యాలకు కూడా దూరంగా ఉంటున్నారు. చిన్నాచితక పనికి బయటి ప్రాంతాలకు వెళ్లడం లేదు. అందరూ కష్టజీవులే కావడంతో రాత్రి ఇంటికి చేరుకొని తినగానే ఆరుబయట స్వేచ్ఛమైన గాలికి నిద్రిస్తారు. కరోనా టీకాను కూడా తండా వాసులు అధిక మొత్తంలో తీసుకున్నారు.
జాగ్రత్తలు పాటిస్తున్నాం..
పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్తలు పాటిస్తున్నాం. మాస్కు లే నిదే బయటకు పోతలేం. గుంపులు ఉన్నా కూడా చాలా దూరంగా ఉం టు న్నాం. – కరంటోతు భాస్కర్ నాయక్, గ్రామస్థుడు
వారానికోసారి శానిటైజర్ చేస్తున్నాం..
తండాలో వారానికోసారి శానిటైజర్ చేస్తున్నాం. కరోనా కట్టడికి అవగాహన కల్పిస్తున్నాం. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇతర వ్యక్తులను రానివ్వడం లేదు. శుభాకార్యాలు చేయడంలేదు. వెళ్లడం కూడా మానుకున్నాం.
– కరంటోతు నర్సింహ నాయక్, సర్పంచ్
బయటకు పోతలేం..
ఊరి వదిలి ఎక్కడ బయటకు పోతలేం. ఇంట్లో ఉన్నవే తింటున్నాం. అవసరమైనప్పుడు సామన్లు తెచ్చుకోవడానికి పోరగాళ్లను పంపిస్తున్నాం. కరోనా రాకుండా ఒక్కొక్కరం దూరంగా ఉంటున్నాం.
– కరంటోతు సాలీ, గ్రామస్థురాలు