కరోనాకు అక్కడి గిరిజనం దూరం
తండాల్లోని ఏ ఒక్కరికీ సోకని కరోనా వైరస్
మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలతో వెల్లివిరిసిన చైతన్యం
కలిసొచ్చిన గిరిజనుల ఆహార అలవాట్లు, జీవన శైలి
స్ఫూర్తిగా నిలుస్తున్న సంస్థాన్నారాయణపురం మండలంలోని పల్లగట్టుతండా, కోప్లతండా, దుబ్బతండా, బెల్లంకొండతండా
ప్రపంచ దేశాలను కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైరస్ ప్రభా వం దేశంలోని అన్ని ప్రాంతాలకు పాకింది. జిల్లా అందుకు మినహాయింపేమీ కాదు. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలను మహమ్మారి చుట్టుముట్టింది. కానీ.. ఆ నాలుగు గిరిజన తండాలు మాత్రం.. కరోనా మహమ్మారిని దూరంగానే ఉంచాయి. గిరిజనులు సంఘటితంగా ఆచరిస్తున్న నిర్ణయాలు.. కట్టుబాట్ల నేపథ్యంలో గత ఏడాది కాలంగా కరోనా వైరస్ ఆ తండాలకు చేరలేకపోయింది. వీటి చుట్టూ ఉన్న అనేక తండాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండగా.. సంస్థాన్నారాయణపురం మండలంలోని పల్లగట్టుతండా, కోప్లతండా, దుబ్బతండా, బెల్లంకొండతండాలు మాత్రం కరోనా వైరస్కు చిక్కకుండా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్నో పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ నాలుగు తండాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
యాదాద్రి భువనగిరి, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సంస్థాన్నారాయణపురం :
గత ఏడాది మార్చిలో వచ్చిన కరోనా మహమ్మారి ఎంతో మందిని పొట్టనబెట్టుకున్నది. రోజు రోజుకూ కరోనా బారిన పడుతున్న వారిని టీవీల్లో, సెల్ఫోన్లలో చూసిన ఆ తండాల గిరిజనులు మొదట్లోనే అప్రమత్తమయ్యారు. కొత్త నిబంధనలు పెట్టుకోవడంతోపాటు ఆంక్షలను విధించుకుని పక్కాగా అమలు చేశారు. చిన్న పిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా ఆచరించారు. మొదటి దశ కరోనా సంస్థాన్నారాయణపురం మండలంలోని పల్లగట్టుతండ, కోప్లతండ, దుబ్బతండ, బెల్లంకొండ తండాల దరిదాపుల్లోకి రాకపోగా, రెండో దశలోనూ కరోనా ఆ తండాల దరిని తాకలేకపోయింది. అక్షరాస్యతలో వెనుకబడిపోయినా.. చైతన్యంలో మాత్రం ఇక్కడి గిరిజనులు ముందు వరుసలో ఉండి మాస్కులను విధిగా ధరించడంతోపాటు భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను నిష్టగా పాటించారు.
నేటికీ ఒక్క కేసు నమోదు కాలేదు..
నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఆవిర్భవించిన పల్లగట్టుతండా జనాభా 700లకు పైనే. ఇక్కడి గిరిజనుల జీవన శైలియే కరోనాను తరిమికొట్టింది. నిత్యం పొలం పనుల్లో నిమగ్నమయ్యే సందర్భంలో విధిగా మాస్కులు ధరిస్తున్నారు. కూలీకి వచ్చే వారు సైతం తప్పక మాస్కుతోనే రావాలని ఖరాఖండిగా చెబుతున్నారు. స్థానిక సర్పంచ్ బాణోతు విజయకిషన్ పాలకవర్గ సభ్యులతో కలిసి గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చారు. మాస్కుల వినియోగం తప్పనిసరి అని ఆంక్షలు విధించడంతోపాటు తరుచుగా బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడం వంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. 30 నుంచి వంద మంది జనాభా ఉన్న తండా పంచాయతీ పరిధిలోని కోప్లతండ, దుబ్బతండ, బెల్లంకొండ తండాల్లో సైతం ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. జాగ్రత్తలు పాటించడంతోపాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ఇది సాధ్యపడిందని ఈ తండాల గిరిజనులు పేర్కొంటున్నారు. వ్యాక్సినేషన్లోనూ ఈ నాలుగు తండాల గిరిజనులు ఆదర్శనీయులే. 45 ఏండ్లకు పైబడిన వారికి ప్రస్తుతం టీకాలు వేస్తున్న నేపథ్యంలో 80 శాతానికి పైగా గిరిజనులు టీకాలు వేసుకున్నారు. వైద్య సిబ్బందే తండాలకు వెళ్లి టీకాలు వేశారు. కరోనాకు సంబంధించి ఎటువంటి లక్షణాలు కన్పించకపోవడంతో ఈ నాలుగు తండాల గిరిజనులు టెస్టుల వరకు వెళ్లే పరిస్థితి రాకుండా పోయింది.
పక్కాగా కట్టడి చర్యలు..
ఈనాలుగు తండాల్లో ఎక్కడ చూసినా మాస్కులు ధరించిన వాళ్లే కనబడుతారు. చిన్న పిల్లలు మొదలుకుని పెద్ద వయస్కుల వరకు విధిగా మాస్కు ధరించాలని నిర్ణయించుకుని పక్కాగా అమలు చేస్తున్నారు. నలుగురు ఓ చోట చేరిన సందర్భంలోనూ మాస్కు ఉండాల్సిందే. మాస్కులు లేకపోయినప్పటికీ మహిళలు చీర కొంగులను, మగవాళ్లు రుమాళ్లను అడ్డుగా పెట్టుకోవడం కన్పిస్తుంది. తరుచుగా చేతులను శుభ్రం చేసుకోవడంతోపాటు బయటకు వెళ్లిన వారు స్నానం చేశాకనే ఇంట్లోకి రావడం వంటి నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లడం వంటివి చేస్తున్నారు. అదీ కుటుంబంలో ఒక్కరే వెళ్లడం.. దగ్గరలోని సంతలకు వెళ్లి వారం, పది రోజులకు సరిపడా సరుకులను తెచ్చుకుంటున్నారు. తండాల్లో ఆర్భాటంగా సాగే శుభ కార్యాలకు సైతం ఇక్కడి గిరిజనులు స్వస్తి పలికారు. తప్పనిసరి చేయాల్సిన శుభ కార్యాలను కుటుంబ సభ్యులతోనే కానిచ్చేస్తున్నారు. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు తండాలకు గతంలోలా తరుచుగా రావడంలేదు. ఇతరులను సైతం గిరిజనులు ఇండ్లల్లోకి రానివ్వడం లేదు. ఏ విషయమైనా ఫోన్ల ద్వారానే తేల్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడి గిరిజనం తీసుకుంటున్న జాగ్రత్తలకు అద్దం పడుతున్నాయి. గుట్టల ప్రాంతంలో జనాభా తక్కువ ఉండటంతో ఈ నాలుగు తండాల్లో భౌతిక దూరం పాటించడం సులువైంది.
తోడ్పాటునిస్తున్న జీవన శైలి..
గిరిజనుల జీవన శైలి కారణంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాని జాబితాలో ఈ నాలుగు తండాలు చేరాయి. వ్యవసాయమే జీవనాధారం కాగా.. పొలాలకు వెళ్లడానికి నడక ద్వారానే వెళ్లాల్సి రావడం వీరికి కలిసొచ్చింది. జొన్న రొట్టెలు, ఇతర పోషకాహారం తీసుకోవడం వంటి ఆరోగ్య జాగ్రత్తలను నిత్యం పాటిస్తున్నారు. మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం తింటుండగా, ఉదయం, రాత్రి వేళల్లో జొన్న రొట్టెలనే తినడం అలవాటు చేసుకున్నారు. జొన్న, రాగి సంకటి వంటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆకు, కూరగాయలను స్థానికంగా పండించుకుని తింటున్నారు. ఇంట్లో పెంచుకున్న నాటు కోళ్లనే వండుకుని తింటున్నారు. నిత్యం పొలం పనుల్లో నిమగ్నమవ్వడం..ప్రకృతిని ఆస్వాదించడం వంటివి కూడా కరోనా వ్యాప్తి నిరోధానికి అనుకూలంశంగా నిలుస్తున్నాయి.
పక్కా ప్రణాళికతో కట్టడి చేశాం
ఎక్కడికి వెళ్లినా శానిటైజర్, మాస్కుల వినియోగం తప్పనిసరి ఆంక్షలు పెట్టాం. మొదట్లో కొందరు వ్యతిరేకించినప్పటికీ వారిలో వచ్చిన మార్పుతో ప్రస్తుతం నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తండాకు మహమ్మారి సోకొద్దని అన్ని కట్టుబాట్లను కఠినంగా అమలు చేస్తున్నాం. – బాణోతు విజయాకిషన్,
పల్లగట్టుతండా సర్పంచ్
మొదట నేనే సూది వేసుకున్న..
మొదట్ల సూది మందు వేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలె. సూది వేసుకుంటే సచ్చిపోతరని భయపడి తండాలెవ్వరూ ధైర్యం చేయలె. ఏమన్నాగానీ.. అని నేనే తొలుత సూది వేయించుకున్న. ఏం కాలేదని తెలిసి ఒకరి తర్వాత ఒకరు తీసుకున్నరు. గిప్పుడు నేను బాగనే ఉన్నా. రెండోసారి కూడా వేసుకోవాలని చెబుతున్నరు. అది కూడా వేసుకునేందుకు సిద్ధమయ్యా.
నేటి వరకు ఒక్క కేసు లేదు..
కోప్లతండ, దుబ్బ తండ, బెల్లంకొండ తండాలకు నేనే ఏఎన్ఎంగా ఉన్న. రెండు రోజులకు ఓసారి ఆశ వర్కర్తో కలిసి వెళ్లి గిరిజనుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నా. చిన్న చిన్న జబ్బులు తప్పితే ఈ మూడు తండా వాసుల్లో కరోనాకు సంబంధించిన లక్షణాలు కనబడలే. అందుకే టెస్టుల అవసరం ఎవరికీ రాలేదు. ఇప్పటివరకు ఈ తండాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. 80 శాతానికి పైగా వ్యాక్సిన్ వేసినం.
– గౌతి పుష్ప, ఏఎన్ఎం
గిసొంటి రోగం ఎప్పుడూ చూడలే
పొద్దుగాల బాగానే ఉండి.. సాయంత్రానికల్లా ప్రాణం తీస్తున్న ఇటువంటి రోగాన్ని నేనెప్పుడూ చూడలే. టీవీల్లో చూసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నం. ఇంట్లో ఉన్నా మాస్కులు పెట్టుకుంటున్నం. ఇంటికి ఎవరినీ రానీయ్యడం లేదు. ఏదన్నా కావాలన్నా.. ఒక్కరమే బయటకు వెళ్తున్నం. శుభ్రం చేసుకున్న తర్వాతనే ఇంట్లోకి వస్తున్నం.
– మెగావత్ రవీందర్, కోప్లతండా వాసి
జొన్న రొట్టెలే మా బలం
తొలుత నుంచీ మేం అన్నం తక్కువగా తింటం. మధ్యాహ్నం ఒక్క పూటే తింటం. మిగిలిన రెండు పూటలూ జొన్న రొట్టెలు, సంకటిని తింటం. ఎల్లిపాయ కారం లేకుండా తింటే తిన్నట్లే ఉండదు. ఆకు, కూరగాయలను కూడా మేమే పండించుకుని తింటున్నం. చికెన్ కూడా బయటి నుంచి తెచ్చుకుంటలేం. ఇంట్లో పెంచుకున్న నాటుకోళ్లనే కోసుకుని తింటున్నం.
– కేలోతు ఇచ్చ, పల్లగట్టుతండా వాసి