మూడు రోజుల్లో 1,66,266 ఇండ్లల్లో సర్వే పూర్తి
ఇంటి వద్దే మెడిసిన్ అందజేసి బాధితులకు భరోసా
5,432 మంది కరోనా అనుమానితుల గుర్తింపు
3,186 మందికి హెల్త్ కిట్ల అందజేత
కరోనా ఆపత్కాలంలో తెలంగాణ ప్రభుత్వం బాధితులకు స్వాంతన చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జిల్లాలో ఇంటింటికీ వెళ్తున్న వైద్య బృందాలు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నాయి. కరోనా అనుమానితులను గుర్తించి హెల్త్ కిట్లను అందజేయడంతోపాటు బాధితులు భయాన్ని వీడేలా భరోసా కల్పిస్తున్నారు. మూడు రోజుల్లో 1,66,266 ఇండ్లల్లో వైద్య బృందాలు ఆరోగ్య పరీక్షలను నిర్వహించాయి. ఈ సందర్భంగా జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలతో బాధపడుతున్న 5,432 మందిని గుర్తించి, 3,186 మందికి హెల్త్ కిట్లను అందజేశారు.
యాదాద్రి భువనగిరి, మే 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మోటకొండూర్, మే 8: ఇంటింటి జ్వర సర్వేకు మండల ప్రజలంతా సహకరించాలని మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ అన్నారు. శనివారం మండలంలోని గ్రామాల్లో గ్రామపంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికి జ్వర సర్వేను చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామా ల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి వివరాలు నమోదు చేసుకుంటున్నట్లు, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి పలు ఆరోగ్య సూచనలు చేస్తున్నట్లు మండల వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంటింటి సర్వే
బీబీనగర్, మే 8 : కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి కోరారు. శనివారం మండలం కేంద్రంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటి జ్వర సర్వే చేపట్టారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తుల్జా ప్రసాద్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్లో…
యాదగిరిగుట్ట రూరల్, మే 8 : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను శనివారం యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా నిర్వహించారు. అన్ని గ్రామాల్లో జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులు అందజేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం కోసమే సర్వే
భువనగిరి అర్బన్, మే 8 : ప్రజల ఆరోగ్యం కోసమే ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తున్నామని ఎంపీడీవో నాగిరెడ్డి అన్నారు. మండలంలోని గ్రామాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతుండగా శనివారం తాజ్పూర్, సిరివేణికుంట గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వరం, దగ్గు, జలుబు ఉంటే భయాందోళన చెందకుండా వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలన్నారు. ఇతర వ్యాధులు ఉంటే వైద్య సిబ్బందికి చెప్పడంతో సంబంధించిన వైద్యం అందించేందుకు సలహాలు సూచనలు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
మోత్కూరు , మే 8: కొవిడ్ నిబంధనలు పాటించాలని మోత్కూరు మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఆకవరం చైతన్యకుమార్ కోరారు. శనివారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో నిర్వహిస్తున్న జ్వర సర్వేను ఆయన పర్యవేక్షించారు. శానిటైజేషన్పై అవగాహన కల్పించారు. కొవిడ్-19 బారినపడిన ప్రతి ఇంటి పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ బిల్ కలెక్టర్ కోల సోమయ్య, వైద్య సిబ్బంది రాములమ్మ, సైదమ్మ, మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు..
సిరిపురంలో..
రామన్నపేట, మే 8: మండలంలో జ్వర సర్వే మూడో రోజూ కొనసాగింది. వైద్య సిబ్బంది గ్రామాల్లోని ఇండ్లకు వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి రవికుమార్, ఆరోగ్య బోధకుడు సత్యనారయణ, సూపర్వైజర్ వాణి శ్రీ, ఏఎన్ఎంలు అరుంధతి,మంజుల, కవిత, గౌసియా, పావని , ఆశవర్కర్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), మే 8 : ఆరోగ్య సమస్యలతోపాటు కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే శనివారం కూడా మండలంలోని అన్ని గ్రామాల్లో కొనసాగింది. గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం, జలుబు ఉన్నవారితో పాటు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఆరోగ్య వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి ప్రణీష, సీహెచ్వో కరుణాకర్, పల్లెర్ల సర్పంచ్ నర్సింహారెడ్డితో పాటు వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
భువనగిరిలో..
భువనగిరి టౌన్, మే 8 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ నిర్వహిస్తున్న జ్వర సర్వే పట్టణంలోని అర్బన్కాలనీలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వరం, జలుబు, సర్ది, దగ్గు, విరోచనాలు, ఒళ్లునొప్పులు తదితర వివరాలను అడిగి తెలుసుకుని మందులు అందజేశారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ కుశంగల ఎల్లమ్మ రాజు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రజిత, ఆర్పీ వరమ్మ పాల్గొన్నారు.
సర్వేను సద్వినియోగం చేసుకోవాలి
వలిగొండ, మే 8: జ్వర సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో గీతారెడ్డి అన్నా రు. సర్వే బృందం సభ్యులు ఇంటింటికి వచ్చినప్పుడు ఆరోగ్య విషయాలను సర్వే బృందానికి తెలియజేయాలని కోరారు. మండలం వ్యాప్తంగా మూడో రోజూ 5068 ఇండ్లను సర్వే చేయించామని, ఇందులో 129 మందికి అనారోగ్య లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న 57 మంది బాధితులకు కరోనా కిట్లు అందజేసినట్లు తెలిపారు.
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
ఆలేరురూరల్, మే 8 : ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎల్పీవో యాదగిరి, ఎంపీవో సలీం సర్వే సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని కొలనుపాక, బైరాంనగరం, రాఘవాపురంలో శనివారం ఇంటింటి జ్వర సర్వేను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందజేయాలన్నారు. 45 ఏండ్లు పైబడిన వారందరికీ రిజిస్ట్రేషన్ చేయించి, వ్యాక్సిన్ వేయించుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.