భువనగిరి కలెక్టరేట్, మే 7: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ నుంచి గూగుల్మీట్ నిర్వహించి కరోనా ఉధృతిపై ఆమె సమీక్షించారు. ప్రతిరోజూ గ్రామాల వారీగా జ్వర సర్వే నిర్వహించాలన్నారు. నాలుగైదు రోజులుగా కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి కరోనా కిట్స్ అందించాలన్నారు. విషమ పరిస్థితుల్లో ఉన్న వారిని దవాఖానలకు తరలించాలని సూచించారు. వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది, కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు ఉంటే ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయరాదని, వైద్యుల సలహాపై మందులు వాడాలన్నారు. పౌష్టికాహారం ద్వారా కరోనాను నియంత్రించుకోవాలన్నారు. హైదరాబాద్ తరహాలో ఏజెన్సీలను గుర్తించి కరోనా బారినపడిన కుటుంబాలకు ఆహారం అందించే ఏర్పాట్లను వెంటనే పరిశీలించాలని అధికారులకు సూచించారు. పీహెచ్సీ సబ్సెంటర్లలో కరోనా ఓపీ తక్షణమే ప్రారంభం కావాలని ఆదేశించారు. జిల్లాలో 11అంబులెన్స్లు, పదకొండు 108 వాహనాలు ఉన్నాయని, డ్రైవర్ల కొరత ఉన్నచో వెంటనే మూడు నెలల కాలానికి తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇంటింటి సర్వేకు డాక్టర్లు పూర్తి బాధ్యత వహించాలన్నారు. గూగుల్మీట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, జిల్లా అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.