ఆలేరు టౌన్, మే 7: జిల్లాలో వచ్చే ఆర్థిక సంవత్సరం రైతులకు ఇచ్చే రుణ పరమితిని ఖరారు చేశారు. బ్యాంకులు అందించే రుణ పరిమితిని ప్రభుత్వం పెంచడం వల్ల రైతులకు కొంత మేలు జరుగనున్నది. ఏటా సాగు వ్యయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. 2021-22 సంవత్సరానికి పంటలు, కూరగాయల సాగు, తోటల పెంపకానికి ఇచ్చే రుణాల విషయంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్టీసీ) ప్రభుత్వానికి వేదిక పంపింది. పంటల రుణ పరిమితిని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ ఖరారు చేసింది. ప్రతి ఏటా వానకాలం సీజన్లో జిల్లా స్థాయి వ్యవసాయ, బ్యాంకింగ్, నాబార్డు అధికారులతో కూడిన టెక్నికల్ గ్రూప్ కమిటీ సమావేశమై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను నిర్ణయిస్తుంది. ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు, కూలీలు, ఇతర పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం అవసరం ఉంటుందో పరిశీలించి ఈ కమిటీ రుణ పరిమితిని నిర్ణయిస్తుంది.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు స్కీం కింద ఎకరాకు అందిస్తున్న రూ. 10వేల పెట్టుబడి సహాయం కూడా రైతులకు ఆర్థికంగా తోడ్పాటును ఇస్తుంది. వీటిని రైతులకు సరైన సమయంలో సక్రమంగా అందించాల్సిన అవసరం ఉంది. సమీకృత వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు నాబార్డు సూచనలతో ఉద్యాన పంటలతో పాటు పాడి, పశువుల పెంపకం చేపట్టే రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది నిర్ణయించారు. అదే విధంగా సాగు నీటి వనరులు లేని ప్రాంతాల్లో వర్షాధార పంటల రుణపరిమితిని వేర్వేరుగా రూపొందించింది. జిల్లాలో అన్ని రకాల పంటల సాగు 2,36,314 ఎకరాలుగా సర్వేలో తేలింది. అలాగే పండ్లు, కూరగాయల సాగు 18,998 ఎకరాల్లో చేస్తున్నారు. ఈ సారి పంట రుణపరిమితిలో ఉద్యాన పంటలకు ప్రాధాన్యం కల్పించారు. ఈ సారి ప్రతి కూరగాయ పంటకు రుణాలు ఇవ్వాలని సూచించారు.
పంటల వారీగా రుణపరిమితి (ఎకరానికి)
సాధారణ వరి రూ. 38వేలు, పత్తి రూ. 38వేలు, జొన్నలు రూ. 20వేలు, సజ్జలు రూ. 12వేలు, రాగి రూ. 14వేలు, మొక్కజొన్న రూ. 28వేలు, కంది రూ. 20వేలు, మినుములు రూ.18వేలు, పెసర రూ. 18వేలు, చెరుకు రూ. 75వేలు, టమాటా రూ. 50వేలు, జామ రూ. 32500, ఆయిల్ ఫామ్ రూ. 38వేలు, మల్బరి పట్టు రూ. 50వేలు, కూరగాయలు రూ. 32వేలు, ఉల్లి రూ. 40వేలు, అల్లం రూ. 63వేలు, మక్క రూ. 28వేలు, మామిడి రూ. 13వేలు, పుచ్చకాయ రూ. 30వేలు, బత్తాయి రూ. 49500, అరటి రూ. 47వేలు, కాప్సికం రూ. 44వేలు, మిరప రూ. 70వేలు, నువ్వులు రూ. 15వేలు, కుసుములు రూ. 38వేలు, వేరుశనగ రూ. 26వేలు నిర్ణయించారు.
రైతులకు ఎంతో మేలు
పంటల రుణపరిమితి పెంచడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగనున్నది. గత ఏడాదితో పోలిస్తే 10శాతం వరకు అదనంగా పెట్టుబడి రైతుల చేతికి అందనున్నది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది.
-గొంగిడి మహేందర్రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్