యాదాద్రి భువనగిరి, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ జనాభా 398 మాత్రమే ఉన్న అతి చిన్న గ్రామ పంచాయతీ తుర్కపల్లి మండలంలోని చోక్లాతండా. 130గడపలు ఉన్న ఈతండాలో పం చాయతీగా ఏర్పాటుకు ముందు సమస్యలు కోకొల్ల లు. తెలంగాణ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో రెండేండ్ల క్రితం పెద్దతండా నుంచి విడిపడి చోక్లాతండా ప్రత్యేక పం చాయతీగా ఏర్పాటైంది. తొలిసారిగా నిర్వహించిన ఎన్నికల్లో తండా గిరిజనులంతా ఏకతాటిపై నిలిచి సర్పంచ్తోపాటు, వార్డులన్నీ ఏకగ్రీవం చేసుకున్నారు. ఆరు వార్డులు కలిగి ఉన్న చోక్లాతండా పంచాయతీలో సర్పంచ్ స్థానంతోపాటు మూడు వార్డులు ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యాయి. మరో మూడు వార్డులు జనరల్కు రిజర్వు అయ్యాయి. అయితే సర్పంచ్ పదవి మహిళకు రిజర్వు కావడంతో తండావాసులంతా ఒక నిర్ణయానికి వచ్చి అన్ని వార్డు పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యత కల్పించారు. కలం పట్టినా..హలం పట్టినా..సేవ చేసి నా..ఉద్యోగం చేసినా.. వాణిజ్యంలో రాణించినా.. పరిశ్రమలు స్థాపించినా.. వారికి వారేసాటి అన్నట్లు గా మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తుండగా.. చోక్లాతండా పం చాయతీ మహిళా పాలకవర్గీయులు సైతం పాలనలో గెలిచి, నిలిచి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
‘పల్లె ప్రగతి’లో మిన్నగా..తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలకు అందిస్తున్న తోడ్పాటును అందిపుచ్చుకుని చోక్లాతండాతోపాటు ఈ పంచాయతీ పరిధిలోని కోక్య తండా, పీర్యతండాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. చోక్లాతండా పంచాయతీకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 14వ ఆర్థిక సంఘం నుంచి నెలనెలా రూ.57వేల చొప్పున ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయి. ఏడాదిలో రూ.60వేల వరకు పన్నులు వసూలు అవుతున్నాయి. ఏడాది మొత్తంలో పంచాయతీకి రూ.9.81లక్షల నిధులు వస్తుండగా.. మహిళా పాలక వర్గీయులంతా సమష్టిగా నిర్ణయాలు తీసుకుని గ్రామాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. పల్లె ప్రగతి పనుల్లో ఎన్నో పంచాయతీలు వెనుకబడిపోగా.. చోక్లాతండా మాత్రం ముందు వరుసలో ఉన్నది. పల్లె ప్రకృతి వనం పచ్చని మొక్కలతో కళకళలాడుతుండగా, డంపింగ్యార్డు పనులు పూర్తయి కంపోస్టు ఎరువు తయారీ దశలో ఉంది.
వైకుంఠధామం నిర్మాణానికి సంబంధించి సింహభాగం పనులు పూర్తికావొచ్చాయి. మిషన్ భగీరథ పథకంలో గడపగడపకూ గోదావరి నీళ్లు అందుతున్నాయి. పక్క ఊరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పింఛన్లను తండాలోనే తీసుకునే వెసులుబాటు కలిగింది. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు ప్రతి ఇంటికీ సంపూర్ణంగా ఒనగూరాయి. పారిశుధ్యం, హరితహారం నిర్వహణ కోసం ముగ్గురు సిబ్బందిని నియమించుకున్నారు. పంచాయతీకి సమకూరిన ట్రాక్టర్తో చెత్తను క్రమం తప్పకుండా సేకరిస్తుండటంతో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో కరోనా మరణాలు చోటు చేసుకున్నప్పటికీ.. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో చెప్పుకోదగ్గ రీతిలో ఇక్కడి పంచాయతీలో కేసులు నమోదు కాలేదు. నూరుశాతం పన్నులు చెల్లించి స్థానిక గిరిజనులు సైతం పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు.