ఆలేరు టౌన్, మే 2: చికెన్ ధర అమాంతం తగ్గింది. ఏప్రిల్ 1వ తేదీన కిలో చికెన్ ధర 220 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో రూ. 120కు పడిపోయింది. కేవలం నెల రోజుల వ్యవధిలో రూ. 100పైగా తగ్గింది. గత వా రం రోజులుగా ప్రతి రోజూ రూ. 10 తగ్గు తూ వచ్చింది. గతేడాది ఇదే సమయంలో కిలో చికెన్ ధర రూ. 250కి విక్రయించారు. అప్పట్లో కొవిడ్ నేపథ్యంలో మటన్, చికెన్కు డిమాండ్ పెరిగింది. చికెన్ ధర అధికంగా ఉండటంతో పౌల్ట్రీ ఫామ్లల్లో కోళ్లను పెంచారు. చికెన్ ధర తగ్గడంతో వినియోగదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా పౌల్ట్రీ ఫాంల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల నిల్వలు పెరిగిపోయాయి. వినియోగం పెరిగినప్పటికీ ధర పెరగకపోవడానికి కారణం నిల్వలు అధికంగా ఉండటమే. లాక్డౌన్ విధిస్తారేమోనని, కొవిడ్ నేపథ్యంలో శుభకార్యాలు కూడా తగ్గాయి. దీంతో ధరలు తగ్గించి అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లైవ్ కోడి కేజీ రూ. 82, స్కిన్తో అయితే కేజీకి రూ. 120, స్కిన్లెస్ అయితే కేజీకి రూ. 130 చొప్పున విక్రయిస్తున్నా రు. ఇదే చికెన్ ధర ఏప్రిల్ 1వతేదీన రూ. 238 ఉండగా, 8వ తేదీన రూ. 274, 16వ తేదీన రూ. 219, 24వ తేదీన రూ. 152, మే 1న రూ. 144 విక్రయించారు. ఇది ఇలా ఉంటే మార్కెట్లో కేజీ మటన్ ధర రూ. 700కు అమ్ముతున్నారు. దీంతో చాలా మంది చికెన్ కొనేందుకు ఇష్టపడుతున్నారు. ధర తగ్గడంతో చికెన్ షాపుల ముందు వినియోగదారులు బారులు తీరుతున్నారు. చికెన్తోపాటు కోడిగుడ్ల ధరలు కూడా తగ్గాయి. మార్కెట్లో 30 కోడిగుడ్ల ధర రూ.117 కే విక్రయిస్తున్నారు. అయితే శుభకార్యాలు లేకపోవడం, ఎండల తీవ్రతతో కోళ్లు అనారోగ్యానికి గురవుతున్నాయి. కోళ్ల నిల్వలు పెరిగిపోవడం, కొవిడ్ నేపథ్యంలో ధరలు తగ్గినట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా పలుచోట్ల చేపలు కూడా తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. ఇది కూడా చికెన్ ధర తగ్గేందుకు ఓ కారణమే.